న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో 6.1-6.3 శాతం మధ్య వృద్ధి సాధించవచ్చని రిజర్వ్బ్యాంక్ అంచనా వేసింది. నవంబర్ నెల బులిటెన్ను శుక్రవారం విడుదల చేస్తూ.. క్యూ2లో ఇదేరీతిలో వృద్ధిని సాధిస్తే 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిరేటు సాధ్యపడుతుందన్నది. ఇప్పటివరకూ వెల్లడైన వివిధ సంకేతాల ఆధారంగా క్యూ2 రేటు 6.3 శాతం వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపింది.
జూలై-సెప్టెంబర్ త్రైమాసికం జీడీపీ డాటా ఈ నెలాఖర్లో వెలువడుతుంది. క్యూ3లో ఆర్థిక రంగం పనితీరును బులిటిన్లో ఆర్బీఐ వివరిస్తూ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం సమీకరణ గత ఏడాది వసూళ్లను మించిందని, గోధుమ సేకరణ క్షీణించినా, రబీలో పంట విస్తీర్ణం పెరిగిందని తెలిపింది. ఆగస్టులో పడిపోయిన పారిశ్రామికోత్పత్తి సెప్టెంబర్ నెలలో పుంజుకున్నదన్నది. నిర్మాణ రంగం విస్తరిస్తున్నదని, టూరిజం, ఆతిథ్యం తదితర సర్వీసులు భారీగా వృద్ధిచెందుతున్నాయని పేర్కొంది. వస్తూత్పత్తులు, సర్వీసులకు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ బాగున్నదని, ఇప్పటివరకూ మందకొడిగా ఉన్న గ్రామీణ డిమాండ్ నెమ్మదిగా పుంజుకుంటున్నదని వివరించింది.
దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున, స్థూల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న అంచనాలు ఏర్పడుతున్నప్పటికీ, అంతర్జాతీయ పరిణామాలతో షాక్ తగిలే అవకాశం ఉంటుందని రిజర్వ్బ్యాంక్ హెచ్చరించింది. ప్రపంచ ఆర్థిక రంగం రిస్క్లో ఉన్నదని, గ్లోబల్ ద్రవ్య పరిస్థితులు కఠినమవుతున్నాయని, మార్కెట్ లిక్విడిటీ తగ్గుతున్నదని తెలిపింది. కేంద్ర బ్యాంక్ల విధాన వడ్డీ రేట్లు మరికొంత పెరగవచ్చన్న అంశాన్ని మార్కెట్లు ఇప్పటికే గ్రహించాయని, దీంతో భారత్లోకి ఈక్విటీ నిధులు వస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్రా రాసిన వ్యాసంలో పేర్కొన్నారు.