Amara Raja Batteries | పేరొందిన బ్యాటరీల తయారీ సంస్థ అమరరాజా బ్యాటరీస్ కీలక నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్ మొబిలిటీ రంగంగా భావిస్తున్న ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. ముందుగా ఈవీ టూ వీలర్స్ చార్జర్లు, బ్యాటరీల తయారీ ద్వారా ఈవీ టూ వీలర్స్ సెక్టార్ లో ఎంటర్ కానున్నది. తద్వారా న్యూ జెనరేషన్ ఎనర్జీ విభాగంలోకి విస్తరించాలని తలపోస్తున్నట్లు సమాచారం.
ఆటోమొబైల్, టెలికం, రక్షణ రంగాలకు రెండు దశాబ్దాలకు పైగా బ్యాటరీలను తయారు చేస్తున్నది. ప్రస్తుతం త్రీ వీలర్ ఈవీలకు ‘అమరాన్’ పేరిట బ్యాటరీలను అమరరాజా బ్యాటరీస్ సరఫరా చేస్తున్నది. వాహనాల బ్యాటరీల తయారీలో లిథియం ఆయాన్ బ్యాటరీలు కీలకం.. ఈ విభాగంలో కంపెనీకి ప్రస్తుతం 2.5 శాతం ఆదాయమే సమకూరుతున్నది. మిగతా రూ.10,385 కోట్ల ఆదాయం ఫ్లాగ్ షిప్ లెడ్ యాసిడ్ స్టోరేజీ బ్యాటరీల ద్వారా సమకూర్చుకున్నది.
ఈ నేపథ్యంలోనే ఈవీ టూ వీలర్స్ లోకి దూకుడుగా ఎంటర్ కావాలని తలపోస్తున్నది అమరరాజా బ్యాటరీస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లిథియం ఆయాన్ బ్యాటరీల ద్వారా వ్యాపారాన్ని మూడు రెట్లు పెంచుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య గౌరినేని చెప్పారు. లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమైన టెక్నాలజీ బదిలీ కోసం పలు గ్లోబల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నది. దీనిపై స్పందించడానికి మాత్రం విక్రమాదిత్య గౌరినేని నిరాకరించారు.