EV Sales | పెట్రోల్, డీజిల్ ధరలు భగభగమండుతున్న వేళ.. ప్రత్యామ్నాయ మార్గంగా విద్యుత్ వాహనాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్కు వినియోగదారుల్లో గిరాకీ భారీగా పెరుగుతోంది. 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ వెహికల్స్ మూడింతలు పెరిగాయని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ (ఫాడా) తెలిపింది. కార్లతో పోలిస్తే టూ వీలర్స్ సేల్స్ ఐదు రెట్లు పెరిగాయి. 2020-21లో 1.34,821 విద్యుత్ వెహికల్స్ అమ్ముడైతే 2021-22లో 4,29,217 యూనిట్లు విక్రయించారు. కరోనాకు ముందు 2019-20లో ఈవీ సేల్స్ 1,68,300 వద్ద నిలిచాయి.
మొత్తంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ మూడింతలు ఎక్కువయ్యాయి. 2020-21లో 4,984 ఈవీ యూనిట్స్ సేల్స్ జరిగితే, గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 17,802కు చేరాయి. హోం గ్రోన్ ఆటోమేజర్ టాటా మోటార్స్ 15,198 ఈవీ కార్లు విక్రయించింది. మొత్తం ఈవీ మార్కెట్లో టాటా మోటార్స్ వాటా 85.37 శాతం. అంతకుముందు 2020-21లో కేవలం 3,523 విద్యుత్ వేరియంట్ కార్లు మాత్రమే విక్రయించింది. ఈవీ కార్ల సేల్స్లో ఎంజీ మోటార్స్ ఇండియా 2020-21లో 1,115 యూనిట్లు విక్రయిస్తే, గతేడాది 2,045 కార్లు విక్రయించింది. మొత్తం మార్కెట్ షేర్ 11.49 శాతం ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్ మోటార్ ఇండియా మూడో, నాలుగో స్థానంలో ఉన్నాయి. మహీంద్రా 156 యూనిట్లు విక్రయిస్తే, హ్యుండాయ్ కార్లు 128 అమ్ముడయ్యాయి. మొత్తంకార్ల విక్రయాల్లో ఒక శాతం లోపే. 2020-21లో మహీంద్రా 94, హ్యుండాయ్ 184 కార్లు విక్రయించాయి.
2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ రిటైల్ సేల్స్ 2,31,338 యూనిట్లకు చేరాయి. 2020-21లో కేవలం 41,046 టూ వీలర్స్ అమ్ముడయ్యాయి. అంటే ఐదు రెట్లు పెరిగాయన్న మాట. టూ వీలర్స్ సెగ్మెంట్లో హీరో ఎలక్ట్రిక్దే ప్రధాన వాటా. 65,303 యూనిట్లు బైక్స్, స్కూటీలు అమ్ముడయ్యాయి. మొత్తం మార్కెట్లో 28.23 శాతం. ఒకినావా ఆటో 46,447 బైక్లు, అంపేర్ వెహికల్స్ 24,648, హీరో మోటో కార్ప్స్ సారధ్యంలోని ఏథేర్ ఎనర్జీ 19,971 యూనిట్లు విక్రయించాయి.
బెంగళూరు కేంద్రంగా విద్యుత్ స్కూటర్లు ఉత్పత్తి చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్ ఆరో స్థానంలో ఉంది. ఓలా స్కూటర్లు 14,371 యూనిట్లు అమ్ముడయ్యాయి. టీవీఎస్ మోటార్స్ కంపెనీ 9,458 బైక్లు, స్కూటీలు విక్రయించింది. ఇక వాణిజ్య వాహనాల (ఈవీ) విక్రయాల్లోనూ పురోగతి నమోదైంది. 2020-21లో 400 యూనిట్లు మాత్రమే విక్రయించగా, గత ఆర్థిక సంవత్సరంలో 2,203 యూనిట్లకు పెరిగాయి.