Whatsapp Spam | గతంలో స్మార్ట్ ఫోన్లు రాకముందు ఫీచర్ మొబైల్ ఫోన్లలో ఎస్సెమ్మెస్లు పంపుకునే వారు. కానీ అనవసర మెసేజ్లు, ఫ్రాడ్ మెసేజ్లు పెరిగిపోవడంతో ఎస్సెమ్మెస్లు నిలిపేశారు. ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తమ మెసేజ్లు వాట్సాప్ లోనే పంపుకోవడం మొదలైంది. కానీ, ఇటీవలి కాలంలో వాట్సాప్ లోనూ స్పామ్, స్కామ్ మెసేజ్లు పెరిగిపోయాయి. గత వారం, పది రోజుల్లో ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి భారీగా మెసేజ్ లు, కాల్స్ వస్తున్నాయి.
రుణాలు, ఉపాధి అవకాశాలు, లాటరీల పేరిట ఇంటర్నేషనల్ నంబర్ల నుంచి వాట్సాప్కు ఎస్సెమ్మెస్లు, కాల్స్ వస్తున్నాయి. మోసగాళ్లు ఇథియోపియా, వియత్నాం, కెన్యా, మలేషియా తదితర దేశాల ఐఎస్డీ కోడ్లతో సదరు కాల్స్, మెసేజ్లు పంపుతున్నారు. ఇది పెద్ద స్కాం అని, వీటికి వాట్సాప్ యూజర్లు స్పందించవద్దని టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అంటున్నారు.
ఇటువంటి మోసగాళ్ల చేతికి తమ ఫోన్ నంబర్లు ఎలా చిక్కాయని వాట్సాప్ యూజర్లు ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై తమ అసహనాన్ని బయట పెడుతున్నారు. ఈ మెసేజ్ లు, కాల్స్ వెనుక ఉద్దేశమేమిటన్నది ఇతమిద్దంగా గుర్తించకున్నా.. పర్సనల్ డేటా, మనీ దోచుకోవడమే లక్ష్యం కావచ్చునని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు.
వాట్సాప్.. వీఓఐపీ నెట్వర్క్ సాయంతో పని చేస్తుంది. ఈ నెట్వర్క్ వల్ల ఏ దేశం నుంచైనా అదనపు చార్జీలు లేకుండా ఫోన్ కాల్ చేయొచ్చు. మెసేజ్లు పంపొచ్చు. అందుకే సైబర్ మోసగాళ్లు అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి మెసేజ్లు పంపి, కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు.
అయినా, ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్ నుంచి కాల్ లేదా ఎస్సెమ్మెస్ వచ్చినా.. అది ఇంటర్నేషనల్ నంబర్ అయ్యి ఉండాల్సిన అవసరమే లేదు. పలు సంస్థలు ఇటీవలి కాలంలో వాట్సాప్ కాల్, మెసేజ్ల కోసం మన సొంత నగరాల్లోనే అంతర్జాతీయ నంబర్లు విక్రయిస్తున్నాయి. కనుక మనకు తెలియని ఫోన్ నంబర్ల నుంచి కాల్స్ వచ్చినా, మెసేజ్లు అప్రమత్తంగా ఉండాలని టెక్నాలజీ ప్రొఫెషనల్స్ హితవు చెబుతున్నారు.