ముంబై: ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత పతనం అవుతున్నది. గత కొన్ని రోజులుగా నష్టపోవడమే తప్ప ఏ ఒక్కరోజు కూడా పుంజుకోలేదు. ఇవాళ్టి ట్రేడింగ్లో కూడా డాలర్తో మారకంలో 40 పైసలు కోల్పోయి రూ.81.93 వద్ద ముగిసింది. ఒక దశలో రూ.81.95 పైసల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత పుంజుకుని రూ.81.93కి చేరింది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం డాలర్ బలపడటానికి ప్రధాన కారణమైంది. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం కోసం అమెరికా ఫెడ్ రిజర్వ్ గత మూడు పర్యాయాల నుంచి వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నది. దాంతో డాలర్ మారకం విలువ బలపడుతున్నది. డాలర్ బలం పుంజుకున్నా కొద్ది రూపాయి పతనమవుతున్నది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం విలువ మరింత పతనమయ్యే ప్రమాదం ఉన్నదని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర సర్కారు రూపాయి పతనానికి అడ్డుకట్టవేసేందుకు కావాల్సిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొదలైన ద్రవ్య పరపతి విధాన సమావేశంలో ఆర్బీఐ తీసుకోబోయే నిర్ణయం కూడా రూపాయి భవిష్యత్తును నిర్ణయించనున్నది.