ముంబై: కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) తాజాగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల రంగంలోకి ఎంటరవుతున్నది. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న వేళ ప్రజలంతా విద్యుత్ వాహనాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వ్యాప్తంగా 100 తమ పెట్రోల్ పంపుల వద్ద ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని ఐవోసీ రిటైల్ జనరల్ మేనేజర్ అజయ్ కుమార్ శ్రీవాత్సవ్ చెప్పారు. వాటిలో మరట్వాడా రీజియన్లో ఐదింటిని ఏర్పాటు చేస్తామన్నారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో అజయ్ కుమార్ శ్రీవాత్సవ్ పాల్గొన్నారు. ఆజాదీ కా అమ్రుత్ మహోత్సవ్ ఇన్షియేటివ్లో భాగంగా ఔరంగాబాద్ ఐవోసీ పెట్రోల్ పంపులో పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు విద్యుత్ చార్జింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఖాదీ ఔట్లెట్ కూడా ఉంది.
ఆన్లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ మహరాష్ట్ర హెడ్ అనిర్బన్ ఘోష్.. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించారు. డిమాండ్ను బట్టి రాష్ట్రంలోని 100 ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్ల కెపాసిటీని 15 కిలోవాట్ల నుంచి 45 కిలోవాట్లకు అప్గ్రేడ్ చేస్తామన్నారు.