న్యూఢిల్లీ, నవంబర్ 29: దేశంలోని స్టాక్ మార్కెట్ విలువ చరిత్రలో తొలిసారిగా 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. భారత కరెన్సీలో ఇది రూ.333.29 లక్షల కోట్లకు సమానం. బుధవారం జరిగిన పెద్ద ర్యాలీతో ఈ ఫీట్ సాధ్యపడింది. 2021 మే 24న బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ ప్రధమంగా 3 ట్రిలియన్ డాలర్లు తాకిన తర్వాత రెండున్నర ఏండ్లలో మరో 1 ట్రిలియన్ డాలర్లు పెరిగింది. 2007 మే నెలలో భారత్ మార్కెట్ విలువ మొదటిసారిగా ఒక ట్రిలియన్ డాలర్లను చేరింది.
అక్కడ్నుంచి 1.5 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అందుకోవడానికి దాదాపు ఏడేండ్లు (2014 జూన్) పట్టింది. 2 ట్రిలియన్ డాలర్లస్థాయిని 2017 జూన్ 6న అందుకుంది. 2.5 ట్రిలియన్ డాలర్ల విలువకు 2020 డిసెంబర్లో చేరింది. ప్రపంచంలో 4 ట్రిలియన్ డాలర్లను మించిన మార్కెట్లలో యూఎస్ (47.78 ట్రిలియన్ డాలర్లు), చైనా (9.74 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (6.02 ట్రిలియన్ డాలర్లు), హాంకాంగ్ (4.78 ట్రిలియన్ డాలర్లు) ఉన్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల నడు మ సెన్సెక్స్ 727 పాయింట్లు ర్యాలీ జరిపి 66,902 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సంవత్సరం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.50.90 లక్షల కోట్ల మేర పుంజుకుంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 15న సాధించిన రికార్డు 67,927 పాయింట్లను సెన్సెక్స్ ఇంకా అందుకోవాల్సి ఉంది. దాదాపు 1,000 పాయింట్ల దూరంలో ఉంది.