ముంబై, జూన్ 30: ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో పయనిస్తున్నదని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. అయితే ఎదురవుతున్న సవాళ్ల దృష్ట్యా ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉందన్నది. గురువారం విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్) ఆర్బీఐ పలు అంశాల్ని ప్రస్తావించింది. అవి…
బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీల వద్ద షాక్లను తట్టుకునేంతగా మూలధన నిల్వలు ఉన్నాయి.
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ల (ఎస్సీబీలు) వద్దనున్న ఆస్తుల రిస్క్ వెయిటేజీతో పోలిస్తే మూలధనం (క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో, సీఆర్ఏఆర్) నూతన గరిష్ఠస్థాయి 16.7 శాతానికి చేరింది.
2022 మార్చినాటికి స్థూల నిరర్ధక ఆస్తులు ఆరేండ్ల కనిష్ఠస్థాయి 5.9 శాతానికి తగ్గాయి.
తీవ్ర ఒత్తిడి ఏర్పడిన పరిస్థితుల్లో కూడా ఎస్సీబీలకు మూలధనం అవసరం తక్కువగానే ఉంటుందని స్ట్రెస్ టెస్ట్ల్లో తేలింది.
క్రిప్టోలు మహాడేంజర్: దాస్
కిప్ట్రోకరెన్సీలు మహా ప్రమాదకరమైనవని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ విశ్లేషించారు. వెనుక ఎటువంటి ఆస్తి లేకుండా విలువ ఆధారంగా నమ్మించేదీ ఏదైనా సరే ఒక ఆధునికమైన పేరుతో జరిగే స్పెక్యులేషనేనని వివరించారు. క్రిప్టోకరెన్సీలపై ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్లతో సహా వివిధ సంస్థల సూచనలు, భాగస్వామ్యపక్షాల అభిప్రాయాల్ని తీసుకుని, ఒక చర్చాపత్రాన్ని ఖరారుచేసే ప్రక్రియలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైన నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్బీఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ముందుమాటలో క్రిప్టోలపై ఆందోళన వ్యక్తంచేశారు. ఫైనాన్షియల్ రంగంలో డిజిటలైజేషన్ పెరుగుతున్నకొద్దీ, అధికమవుతున్న సైబర్ రిస్క్లపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.