EV Vehicles | వచ్చే ఎనిమిదేండ్లలో భారత్ రోడ్లపైకి ఐదు కోట్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ రానున్నాయి. వాటిల్లో టూ వీలర్స్ సుమారు 70 శాతం ఉంటాయి. కానీ, పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకానికి అనుగుణంగా చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అందుబాటులో ఉండాలి. దేశవ్యాప్తంగా 20.5 లక్షల చార్జింగ్ స్టేషన్లు అవసరం అని జేఎంకే రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో తేలింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి అవసరమైన చార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉన్నాయని ఆ సర్వే రిపోర్ట్ చెప్పింది. 32 ఎలక్ట్రిక్ వెహికల్స్కు ఒక చార్జింగ్ స్టేషన్ మాత్రమే ఉందని పేర్కొంది.
2030 నాటికి ఐదు లక్షల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతోనూ, వివిధ చార్జింగ్ పాయింట్ ఆపరేటర్లు దేశంలో కొత్తగా విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సంకల్పించాయని నివేదిక వ్యాఖ్యానించింది. భారత్లో ఈవీల ఫాస్ట్ చార్జింగ్ వసతులు చాలా పరిమితం అని తేల్చేసింది.
పని ప్రదేశాలు (కంపెనీలు, సంస్థల కార్యాలయాలు0, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్ల వద్ద పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ వసతులు కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జేఎంకే రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఇండ్ల వద్ద, పని ప్రదేశాల్లో `ఈవీ`లకు సరిపడా పార్కింగ్ ఫెసిలిటీ కల్పించాలని సూచించింది. ప్రతి పెట్రోల్ పంప్ వద్ద కనీసం ఒక్క చార్జింగ్ స్టేషన్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది.
పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల వద్ద అద్దెలపై పరిమితులు విధిస్తూ విధానాలు తేవాలని జేఎంకే రీసెర్చ్ సూచించింది. పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లకు అవసరమైన ల్యాండ్ బ్యాంక్ తేలిగ్గా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వ విధానాలు రూపొందించాలని పేర్కొన్నది. లీజింగ్ కాస్ట్ తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించింది. చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కోసం పాక్షికంగా ప్రజాధనం వినియోగించాలని స్పష్టం చేసింది. చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడంతోనే లాభాల కోసం పరుగులు తీయొద్దని, ఫైనాన్సియల్ అసిస్టెన్స్ కల్పిస్తూ క్యాపిటల్ ఇంటెన్సివ్ చర్యలు చేపట్టాలని పేర్కొన్నది.