GDP | 2027-28 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్లకుపైగా జీడీపీతో భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత ఎనిమిది తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్ డార్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందిందని ఆర్థిక మంత్రి చెప్పారు.
వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్లో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందన్నారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి.. ఆ సమయానికి మన జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుంది. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా, గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉన్నది.
కేంద్రమంత్రి మాట్లాడుతూ 2023 వరకు 23 ఏళ్లలో భారత్కు 919 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్డీఐలో 65శాతం అంటే 595 బిలియన్ డాలర్లు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో వచ్చాయని తెలిపారు. ఆర్థిక సమ్మేళనాన్ని ప్రస్తావిస్తూ.. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు.