Gadkari Alert | వచ్చే ఆరు నెలల్లో ఆటోమొబైల్ సంస్థలు తప్పనిసరిగా వందశాతం బయో-ఫ్యూయల్తో నడిచే ఇంజిన్లతో కూడిన వాహనాలను అందుబాటులోకి తేవాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పెట్రోల్ ధరల భారంతో తల్లడిల్లుతున్న వాహనాల వినియోగదారులకు ఖర్చు తగ్గనున్నది. లీటర్ పెట్రోల్పై రూ.110 ఖర్చు చేస్తే బయోఇథనాల్ లీటర్ రూ.65లకే లభిస్తుంది. పెట్రోల్ ఆల్టర్నేటివ్ ఇంధనం వాడకంతో కాలుష్యం తగ్గించడంతోపాటు విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి.
ఫ్లెక్స్ (ఇథనాల్ ఆధారిత) ఇంజిన్తో కూడిన వాహనాలను వినియోగదారులకు అందుబాటులోకి తేవడానికి మేం కట్టుబడి ఉన్నాం. మేం నిర్ణయం తీసుకున్నాం. దీన్ని తప్పనిసరి చేస్తాం అని
నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో చెప్పారు. ఆరు నెలల్లోపు ఫ్లెక్సీ ఇంజిన్ల తయారీ తప్పనిసరి అని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు.
పెట్రోల్, డీజిల్లతోపాటు వినియోగదారులకు బయో-ఫ్యూయల్ అందుబాటులోకి తేవాలని కేంద్ర చమురు సంస్థలను ఆదేశించామని నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఇప్పటికే వరి, మక్క, చెరకు వంటి పంటల్లో మిగులు దిగుబడి సాధించామని గుర్తు చేశారు. వీటి ద్వారా బయో-ఇథనాల్ తయారు చేయొచ్చు. పెట్రోల్ నుంచి ఇథనాల్ వైపు వెళ్లడం దేశానికి తప్పనిసరి అని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ధరలతో పోలిస్తే వాణిజ్య పంటల కంటే ఆహార పంటలకు అధిక కనీస మద్దతు ధరను ప్రకటించామన్నారు. కనుక దేశ ప్రయోజనాల కోసం ప్రజలంతా ఆహార పంటల సాగు దిశగా మళ్లడం తప్పనిసరి అన్నారు.