AK-203 Factory in Amethi | ఇక అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఏకే-203 రష్యా రైఫిల్స్ ఇక భారత్లోనే ఉత్పత్తి కానున్నాయి. ఈ విషయమై భారత్లోనే తయారుచేసి సైన్యానికి అందించడానికి రెండు దేశాల మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది. సోమవారం ఇరు దేశాల రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, సెర్గీ షొయిగు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇంతకుముందు ఇరువురు నేతలు రెండు దేశాల మధ్య రక్షణ రంగ సహకారంపై చర్చించుకున్నారు.
రష్యా టెక్నాలజీతో ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఏర్పాటు చేసే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో ఈ రైఫిల్స్ ఉత్పత్తి చేస్తారు. రూ.5,000 కోట్ల విలువ గల ఆరులక్షల పై చిలుకు ఏకే-203 రైఫిల్స్ భారత్లోనే తయారవుతాయి. పదేండ్ల పాటు రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరు దేశాల రక్షణ మంత్రులు సంతకాలు చేశారు. అలాగే కలాష్నికోవ్ ఆయుధాల కోసం 2019లో జరిగిన ఒప్పందాల్లో సవరణలు తేవడానికి ఇరువురు నేతలు అంగీకరించారు.
రష్యాతో దీర్ఘకాలిక అనుబంధం కలిగి ఉండటంతోపాటు ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామి అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. వివిధ అంశాలలో భారత్కు రష్యా అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఇదిలా ఉంటే రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్, భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ద్వైపాక్షిక అంశాలపై చర్చించుకున్నారు.