IndiaPost | కరోనా మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్యం పట్ల, తమ కుటుంబాల భద్రత పట్ల శ్రద్ధ పెరిగింది. తమకు, తమ కుటుంబాలకు ప్రమాద బీమా కోసం కొత్త పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబంలోని ప్రతి సభ్యుడికి ప్రమాద బీమా పాలసీ తీసుకోవడం చాలా ముఖ్యం. తక్కువ ప్రీమియంతోనే ఇండియా పోస్టాఫీసు బెటర్ ప్లాన్తో కూడిన యాక్సిడెంటల్ బీమా పాలసీ తీసుకొచ్చింది. ఈ పాలసీలోనూ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఏటా రూ.299, రూ.399 ప్రీమియం ఆప్షన్లతో వేర్వేరుగా బెనిఫిట్లు అందిస్తున్నది.
రూ.399 ప్రీమియం కింద పాలసీ తీసుకున్న వ్యక్తి ఏదైనా ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. శాశ్వత వైకల్యానికి గురైనా, పాక్షిక వైకల్యానికి గురైనా కూడా రూ.10 లక్షల కవరేజీ ఫెసిలిటీ ఉంటుంది. రూ.60 వేల వరకు వైద్య ఖర్చులకు క్లయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చుల కింద రూ.30 వేలు పొందొచ్చు. పాలసీ దారు మరణిస్తే, కుటుంబానికి రూ.10 లక్షల బెనిఫిట్స్తోపాటు ఇద్దరు పిల్లల ఉన్నత విద్యా అవసరాలకు రూ.లక్ష వరకు చెల్లిస్తుంది ఇండియన్ పోస్టాఫీస్. దవాఖానలో చికిత్స పొందుతున్న వారికి పది రోజుల వరకు రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తుంది. కుటుంబ రవాణా ప్రయోజనం కింద అసలు లేదా రూ.25వేలల్లో ఏది తక్కువైతే అది పే చేస్తుంది.
రూ. 299 ప్రీమియం కింద కూడా రూ.399 ప్రీమియం పాలసీ రక్షణలు, ఆప్షన్లన్నీ వర్తిస్తాయి. ఈ రెండు ప్రీమియంల ఆప్షన్లలో ఒకే ఒక్క తేడా ఉంటుంది. రూ.299 ప్రమాద రక్షణ పథకంలో మరణించిన వారి పిల్లల విద్యా అవసరాలకు సాయం ఫెసిలిటీ ఉండదు.
18-65 ఏండ్ల మధ్య వయస్సు గల వారంతా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. అటువంటి వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ప్రమాద బీమా అత్యవసరమే. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, టాటా ఏఐజీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రమాద బీమాకు తపాలా శాఖ.. గ్రూప్ యాక్సిడెంటల్ గార్డ్ అనే కొత్త పాలసీని తీసుకొచ్చింది.
అతి తక్కువ వార్షిక ప్రీమియం రూ.299, రూ.399లకే అత్యధిక బెనిఫిట్లు లభిస్తాయి. ఈ పథకంలో చేరదల్చుకున్న వారు సమీప పోస్టాఫీసులో సంప్రదించాలి. పోస్ట్మ్యాన్కు ఫోన్ చేసినా వారు ఇంటికొచ్చి సేవలందిస్తారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ను వినియోగించుకోవాలని ఆర్థిక వేత్తలు, బీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు.