Infosys co-founder : ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో పనిచేయడానికి భారత్మంచి ప్లేస్ అని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ అన్నాడు. బెంగళూరులో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన మాట్లాడాడు. ‘ప్రపంచమంతా తీవ్రమైన ఆర్థికమాంద్యంలో ఉంది. అయినా కూడా భారత్లో ఐటీ పరిశ్రమ రెండంకెల వృద్ధి రేటుతో పయనిస్తోంది. ఈ ఏడాది దాదాపు 12 శాతం వృద్ధి నమోదు చేయనుంది. ఈ సంవత్సరం దాదాపు 2-3 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. భారతదేశ వృద్ధి రేటు కూడా 6.3 ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఇది మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ’ అని ఆయన తెలిపాడు.
ఈ సందర్భంగా ఉద్యోగుల తొలగింపు గురించి ప్రస్తావిస్తూ… ‘కొన్ని పెద్ద టెక్ కంపెనీలు విఫలం కావడం వల్ల భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే, ఉద్యోగాల కోత అనేది తక్కువగానే ఉంది. అని తెలిపాడు. అంతేకాదు పెద్ద కంపెనీలు ఉద్యోగులను తీసేయడం అనేది ఐటీ కంపెనీల్లో చేరాలి అనుకుంటున్న యువతరం అవకాశాల్ని దెబ్బతీయదు’ అని గోపాలకృష్ణన్ పేర్కొన్నాడు. ఆటోమొబైల్, ఆరోగ్యం, ఈ-కామర్స్ వంటి రంగాలు టెక్నాలజీ సాయంతో త్వరితగతిన పురోగతి చెందుతున్నాయని అన్నాడు. అంతేకాదు ఐటీ రంగం అభివృద్ధిని డాక్యుమెంటరీగా తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.