ముంబై, ఫిబ్రవరి 7: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.21,028 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. బ్యాంక్ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంతటి లాభాలను ఆర్జించడం ఇదే తొలిసారి. కిందటేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన లాభంతో పోలిస్తే 13 శాతం వృద్ధిని కనబరిచింది. కన్సాలిడేటెడ్ విషయానికి వస్తే రూ.21,317 కోట్ల లాభాన్ని చవిచూసింది. సమీక్షకాలంలో బ్యాంక్నకు వడ్డీల మీద వచ్చే ఆదాయం 9 శాతం ఎగబాకి రూ.45,190 కోట్లకు చేరుకున్నది.
కిందటేడాది ఇది రూ.41,446 కోట్లుగా ఉన్నది. బ్యాంక్ రుణాల్లో వృద్ధి 15 శాతం నమోదు అయింది. వడ్డీయేతర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.65 శాతం అందుకొని రూ.8,404 కోట్లకు చేరుకున్నది. మొత్తంమీద గత త్రైమాసికంలో బ్యాంక్ ఖర్చులు రూ.1,04,917 కోట్ల నుంచి రూ.1,08, 052 కోట్లకు పెరిగాయి. బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్బీఐ ఎంఎఫ్ నుంచి రూ.2,200 కోట్లు డివిడెండ్ రూపంలో రావడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. గత త్రైమాసికంలో కొత్తగా రూ.4,458 కోట్ల రుణాలు మొండి బకాయిల జాబితాలోకి చేరాయన్నారు.
కిందటేడాది నమోదైన రూ.3,823 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగాయన్నారు. అయినప్పటికీ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.73 శాతం నుంచి 1.57 శాతానికి దిగిరాగా, అలాగే మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.4,507 కోట్ల నిధులను కేటాయించింది. గతేడాది రూ.911 కోట్లు మాత్రమే. క్యాపిటల్ అడెక్వసి రేషియో 14.04 శాతంగా ఉన్నది. డిపాజిట్లలో వృద్ధి 9.02 శాతం సాధించినట్టు చెప్పారు.