Facial Recognition | రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేయడానికి కేంద్ర టెలి కమ్యూనికేషన్ల శాఖ సిద్ధమైంది. అందుకోసం సెంటర్ ఆఫ్ డెవలప్మెంట్ టెలిమ్యాటిక్స్ (సీ-డీఓటీ)తో జత కట్టి టెక్నాలజీని డెవలప్ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిధిని మించి స్మార్ట్ ఫోన్ల కొనుగోలును నియంత్రించడానికి వీలు కలుగుతుంది.
ఒకరు తొమ్మిది సిమ్ కార్డులు మాత్రమే కొనుగోలు చేసేందుకు కేంద్ర నిబంధనలు అనుమతి ఇస్తున్నాయి. కానీ కొందరు వ్యక్తులు వందల్లో, వేలల్లో సిమ్ కార్డులు పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సైబర్ మోసగాళ్లు అలా సేకరించిన సిమ్ కార్డులతోనే సైబర్ నేరాలు చేస్తుంటారు. అటువంటి వారిని గుర్తించడానికే కేంద్ర టెలికం శాఖ, సీ-డీఓటీ డెవలప్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్. గరిష్ట పరిమితిని మించి సిమ్ కార్డులు కొనుగోలు చేసిన వ్యక్తులను ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తిస్తారు.
సైబర్ మోసగాళ్లు కూడా తమను గుర్తించకుండా ఉండేందుకు మారువేషాలు వేస్తారు. కానీ పెదవులు, కండ్లలో మార్పు ఉండదు. దీని వల్ల ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో అటువంటి వ్యక్తులను గుర్తించవచ్చునని అధికార వర్గాల కథనం. ఈ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గత ఆరు నెలల్లో 64 లక్షలకు పైగా ఫోన్ కనెక్షన్లను కేంద్రం రద్దు చేసింది.
అలా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తించిన వ్యక్తుల డేటాను సంబంధిత టెలికం సంస్థలకు అందిస్తుంది కేంద్ర టెలీ కమ్యూనికేసన్స్ శాఖ. ఆ డేటా ప్రకారం సంబంధిత వ్యక్తులను కేవైసీ సమర్పించాలని సదరు టెలికం సంస్థలు నోటీసులు జారీ చేస్తాయి. రెండు నెలల్లో సమాధానం రాకపోతే.. ఆయా సిమ్ కార్డుల కనెక్షన్ రద్దు చేస్తాయి.
కొన్ని సార్లు వెయ్యి, రెండు వేల ఫోటోలను గుర్తించామని టెలీ కమ్యూనికేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. అటువంటి వారంతా సైబర్ మోసాలకు పాల్పడినట్లు తేలిందంటున్నారు. వారిలో కొందరు కొనుగోలు చేసిన సిమ్ కార్డులతో వాట్సాప్ ఖాతాలు తెరిచి మోసాలకు పాల్పడుతున్నారు. త్వరలో వాట్సాప్ మోసాలపైనా ఫోకస్ చేస్తామని చెబుతున్నారు. సిమ్ కార్డుల మోసం వెనుక ఏజెన్సీల పాత్రే ప్రధానం అని, వారిపై చర్యలు తీసుకుంటాం అని అంటున్నారు. ఈ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సిమ్ కార్డులు జారీ చేసే డీలర్లకు కేంద్రం పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది.