Rice Exports Ban | భారత్కు మాత్రమే కాదు యావత్ ప్రపంచ దేశాలకూ అన్నపూర్ణ.. కానీ విదేశాలకు బియ్యం ఎగుమతిపై నిషేధం విధించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నది. ఎల్నినో వాతావరణం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. అన్ని వెరైటీల బాస్మతియేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడానికి కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తున్నట్లు సమాచారం. దేశీయంగానూ బియ్యం ధరలతోపాటు ద్రవ్యోల్బణం మరింత పైపైకి దూసుకెళ్లకుండా నివారించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం ప్రతిపాదన అమల్లోకి వస్తే 80 శాతం బియ్యం ఎగుమతులు నిలిచిపోతాయి. దీనివల్ల దేశీయంగా ధరలు తగ్గినా.. గ్లోబల్ కాస్ట్ రిస్క్ పొంచి ఉంటుందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచ జనాభా సగం ఉప్పుడు బియ్యం వాడుతున్నారు. గ్లోబల్ సరఫరాలో ఆసియా దేశాల్లో 90 శాతం బియ్యం వినియోగిస్తారు. మరోవైపు ఎల్నినోతో పంటలు దెబ్బ తినడం వల్ల బియ్యం ధరలు ఇప్పటికే రెండేండ్ల గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లాయని ఆందోళన వ్యక్తం అవుతున్నది. ప్రపంచవ్యాప్త బియ్యం వ్యాపారంలో భారత్ వాటా సుమారు 40 శాతం. కొన్ని రకాల వెరైటీ బియ్యం ఎగుమతిపై నిషేధం విధించవచ్చు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో గతేడాది బియ్యం ఎగుమతుల (broken rice exports)పై నిషేధం విధించింది. గోధుమలు, బ్రౌన్ రైస్ దిగుమతులపై 20 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించింది. గోధుమలు, పంచదార ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది.
విదేశాలకు బియ్యం ఎగుమతులపై నిషేధం విధించే విషయమై స్పందించేందుకు ఆహార, వాణిజ్య, ఆర్థిక మంత్రిత్వశాఖల ప్రతినిధులు ముందుకు రాలేదు. బెనిన్, చైనా, సెనెగల్ సహా 100కి పైగా దేశాలకు భారత్ బియ్యం సరఫరా చేస్తున్నది. బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తుందన్న వార్తల నేపథ్యంలో ఇండియన్ రైస్ మిల్లర్ల షేర్లు పతనయ్యాయి. దేశంలోనే అతిపెద్ద రైస్ కంపెనీ 3.7 శాతం, చమల్లాల్ సెతియా ఎక్స్పోర్ట్స్ 1.4 శాతం, కోహినూర్ ఫుడ్స్ 2.9 శాతం, ఎల్టీ ఫుడ్స్ 4.4 శాతం నష్టపోయాయి.