చెన్నై, మే 27:సిమెంట్ తయారీ సంస్థ ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ లాభాలకు ముడి పదార్థాల ధరల సెగ గట్టిగానే తగిలింది. గత త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు సుడిగాలిలా పెరగడంతో కంపెనీ నష్టాల్లోకి జారుకున్నది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.23.71 కోట్ల నష్టం వచ్చింది. అంతక్రితం ఏడాది సంస్థ రూ.71.63 కోట్ల నికర లాభాన్ని గడించింది. అటు ఆదాయంలోనూ గండిపడింది. 2020-21 నాలుగో త్రైమాసికంలో రూ.1,461.44 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.1,396.72 కోట్లకు పడిపోయింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.4,729.83 కోట్ల ఆదాయంపై రూ.38.98 కోట్ల స్టాండ్లోన్ నికర లాభాన్ని గడించింది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా శుక్రవారం సమావేశమైన కంపెనీ బోర్డు రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూపాయి డివిడెండ్ను ప్రతిపాదించింది.
సిమెంట్ ధరలు పెంచుతాం
వచ్చే నెలలో సిమెంట్ ధరలు పెంచడానికి సిద్ధమైంది ఇండియా సిమెంట్స్. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడంతో ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. జూన్1న బస్తా ధరను రూ.20, అదే నెల 15న బస్తాపై మరో రూ.15, జూన్ 30న మరో రూ.20 మేర పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. మొత్తంగా వచ్చే నెలలో బస్తా ధరను రూ.55 వరకు పెంచాలనుకుంటున్నది. ప్రస్తుతం దక్షిణ భారతంలో బస్తా ధర రూ.360 నుంచి 400 స్థాయిలో ఉన్నది. దక్షిణాదిలో అగ్రగామి సిమెంట్ తయారీ సంస్థయైన ఇండియా సిమెంట్స్కు ఏడు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.