India-Canada Air Fares | భారత్, కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్ నుంచి కెనడాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే విమాన సర్వీసుల టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. చివరిక్షణంలో టికెట్లు కొనుగోలు చేస్తున్న వారు 25 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాకు వెళ్లే ప్రయాణికులు సైతం తమ ప్లాన్లను వాయిదా వేస్తున్నారు.
న్యూఢిల్లీ-టొరంటో మధ్య నేరుగా వెళ్లే విమాన సర్వీస్ టికెట్ ధర రూ.1.46 లక్షలు దాటింది. టోరంటో-ఢిల్లీ సర్వీస్ రూట్ రూ.1.01 లక్షలపై చిలుకు పలుకుతోంది. న్యూఢిల్లీ-మాంట్రియల్ సర్వీస్ రూ.1.55 లక్షల పై చిలుకు, మాంట్రియల్ -న్యూఢిల్లీ సర్వీస్పై రూ.1.16 లక్షల పై చిలుకు టికెట్ల కొనుగోలు కోసం చెల్లించాల్సి వస్తోంది. ఢిల్లీ-వాంకోవర్ మధ్య లేట్ బుకింగ్ వల్ల సుమారు రూ.1.33 లక్షలు.. వాంకోవర్-ఢిల్లీ టికెట్ కోసం సుమారు రూ.1.3 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తున్నది.
చివరి క్షణంలో బుక్ చేసుకునే వారి టికెట్ ధరలు 25 శాతం పెరిగాయని ట్రావెల్ పోర్టల్స్ తెలిపాయి. కెనడా వెళ్లే వారిలో పర్యాటకులతోపాటు అక్కడ నివసిస్తున్న స్నేహితులు, కుటుంబ సభ్యులను కలుసుకోవాలని భావించే వారే ఎక్కువ.
ఎయిర్ ఇండియా, ఎయిర్ కెనడా మాత్రమే నేరుగా ఈ రూట్లో విమానాలు నడుపుతున్నాయి. రెండు దేశాల మధ్య వారానికి 48 విమాన సర్వీసులు నడుస్తాయి. న్యూఢిల్లీ-టోరంటో, న్యూఢిల్లీ-వాంకోవర్ మధ్య ఎయిర్ ఇండియా, న్యూఢిల్లీ- టోరంటో రూట్లో రోజూ.. న్యూఢిల్లీ-మాంట్రియల్ మధ్య ఎయిర్ కెనడా మూడు సర్వీసులు నడుపుతున్నది.
ఇదిలా ఉంటే కెనడాకు వీసాలను సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం భారత్ ప్రకటించింది. ఆపరేషనల్ అంశాల వల్ల వీసాలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.