న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పలు చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ గురువారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను మూడేండ్ల కాలపరిమితి కలిగిన పోస్టాఫీస్ డిపాజిట్లపై వడ్డీరేటును 5.5 శాతం నుంచి 5.8 శాతానికి పెంచింది. అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచుతూ 7.4 శాతం నుంచి 7.6 శాతానికి తీసుకెళ్లినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇక కిసాన్ వికాస్ పత్రకు సంబంధించి అటు కాలపరిమితిని, ఇటు వడ్డీరేట్లనూ ప్రభుత్వం సవరించింది. వడ్డీరేటును 6.9 శాతం నుంచి 7 శాతానికి పెంచగా.. కాలపరిమితిని రెండు, మూడేండ్లకు పెంచింది. నెలసరి ఆదాయ ఖాతా పథకం వడ్డీరేటును కూడా 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచారు.
ఎన్సీఎస్, పీపీఎఫ్ల జోలి లేదు
చిన్నమొత్తాల పొదుపు పథకాలన్నింటికీ ఈ వడ్డీరేట్ల పెంపు వర్తించదు. సేవింగ్స్ డిపాజిట్తోపాటు ఒకటి, ఐదేండ్ల ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్సీఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాల జోలికి వెళ్లలేదు. వీటిపై పాత వడ్డీరేట్లే రాబోయే త్రైమాసికంలోనూ చెల్లుబాటవుతాయి. ఇక వడ్డీరేట్లు పెంచినా పదేండ్ల ప్రభుత్వ బాండ్లపై ప్రస్తుతమున్న ఈల్డ్కు సమానం కాకపోవడం విమర్శలకు దారితీస్తున్నది. సామాన్యులకు ఎంతో చేరువైన చిన్నమొత్తాల పొదుపు పథకాలను మోదీ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని అంటున్నారు.