ITR Filing | ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చే నిర్ణయం తీసుకున్నది. ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించే ప్రసక్తే లేదని శుక్రవారం కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టం చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి శుక్రవారం (డిసెంబర్ 31) చివరి గడువు కావడం గమనార్హం.
శుక్రవారం (డిసెంబర్ 31) మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇన్కం టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ సజావుగా సాగుతున్నదని తరుణ్ బజాజ్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు 5.62 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్న్స్ ఫైల్ అయ్యాయన్నారు. ఈ రోజు ఒక్కరోజే 20 లక్షలకు పైగా ఐటీఆర్స్ దాఖలయ్యాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 60 లక్షలకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయని చెప్పారు.
ఒకవేళ ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగిస్తే పన్ను చెల్లింపు దారు ఆదాయం రూ.5 లక్షలకు పైగా ఉంటే రూ.5000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు.. కొన్ని బెనిఫిట్లు వదులుకోవాల్సి వస్తుంది. అదనంగా చెల్లించే పన్నుపై వడ్డీ కూడా చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి 2022 మార్చి 31 తేదీ తుది గడువు కావడం గమనార్హం. సాధారణంగా ప్రతియేటా జూలై నెలాఖరుతో ఐటీ రిటర్న్స్ గడువు ముగుస్తుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గతేడాది, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో గడువు పలుమార్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.