Atal Pension Yojana | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక పెన్షన్ స్కీం.. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై). ఈ పథకంలో పలు నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఆదాయం పన్ను (ఐటీ) చెల్లిస్తున్న వారు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి `ఏపీవై` స్కీమ్లో చేరడానికి అనర్హులని పేర్కొంటూ కేంద్ర ఆర్థికశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా 2015లో మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. అసంఘటిత రంగంలో పని చేస్తూ రిటైరైన వారికి ఫైనాన్సియల్ కవరేజీ కల్పించే పథకం ఇది. ఒకవేళ అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకంలో చేరిన సబ్స్క్రైబర్.. పన్ను చెల్లింపుదారుడైతే అతడి ఏపీవై ఖాతా మూసేసి, పెన్షన్ను ఆ వ్యక్తికి తిరిగి చెల్లిస్తారు.
60 ఏండ్ల వయస్సు దాటిన వారికి ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.5000 వరకు అటల్ పెన్షన్ యోజన కింద ఫించన్ లభిస్తుంది. 18-40 ఏండ్ల మధ్య వయస్కులు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. కనీసం 20 ఏండ్లు పెట్టుబడి పెట్టడం తప్పనిసరి. రూ.1000 నుంచి రూ.5000 పెన్షన్ పొందాలంటే సబ్స్క్రైబర్ ప్రతి నెలా రూ.42 నుంచి రూ.210 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18 ఏండ్ల నుంచి సబ్స్క్రైబర్లుగా చేరిన వారికి ఈ ప్రీమియం వర్తిస్తుంది.
40 ఏండ్ల వయస్సు గల వ్యక్తి సబ్స్క్రైబర్ అయితే ప్రతి నెలా రూ.291-1,451 చెల్లించాల్సి ఉంటుంది. సబ్స్క్రైబర్ అధిక ప్రీమియం చెల్లిస్తే, రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్ పొందుతారు. సబ్స్క్రైబర్ మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి, ఇద్దరూ మరణిస్తే నామినీకి 60 ఏండ్ల వయస్సు వచ్చే వరకు పెన్షన్ చెల్లిస్తారు. 60 ఏండ్ల లోపు సబ్స్క్రైబర్ మరణిస్తే.. మిగతా కాలం ఆ జీవిత భాగస్వామి కంట్రిబ్యూషన్ చేస్తుందాలి.
కనీస పెన్షన్ హామీ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం చేపట్టింది. సబ్స్క్రైబర్లు నెలవారీ, త్రైమాసికానికోసారి, ఆరు నెలలకోసారి చెల్లించొచ్చు. ప్రీమియం కంట్రిబ్యూషన్ కోసం ఆటో-డెబిట్ ఆప్షన్ ఎంచుకుంటే మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్గా మీ పెన్షన్ ఖాతాలోని ప్రీమియం క్రెడిట్ అవుతుంది.
ఆన్లైన్లోనూ ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరొచ్చు. ఇప్పటికే నాలుగు కోట్ల మందికి పైగా ఖాతాదారులు చేరారు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) తెలిపిన గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 99 లక్షలకు పైగా ఖాతాలు ప్రారంభమయ్యాయి.
అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్లు ఏపీవై స్కీమ్ను ఆఫర్ చేస్తున్నాయి. భారతీయ స్టేట్బ్యాంక్ (ఎస్బీఐ)లో అటల్ పెన్షన్ స్కీం తెరవచ్చు. ఏదేనీ బ్యాంక్ శాఖకు వెళ్లి ఏపీవై ఖాతా ప్రారంభించొచ్చు. అవసరమైన పత్రాలతో అటల్ పెన్షన్ యోజన ఫామ్ నింపి సంబంధిత బ్యాంకు శాఖలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అప్రూవ్ అయితే, మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
సేవింగ్స్ ఖాతా లేకుండానే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకంలో చేరొచ్చు. తొలి ఇన్వెస్ట్మెంట్ తేదీని బట్టి నెలవారీ కంట్రిబ్యూషన్ తేదీ ఖరారవుతుంది. ఈ పథకంలో మీతోపాటు నామినీ పేరు తప్పనిసరిగా చేర్చాల్సిందే. ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క అటల్ పెన్షన్ యోజన ఖాతాను మాత్రమే తెరువడానికి అనుమతి ఇస్తారు. నెలవారీ కంట్రిబ్యూషన్కు అవసరమైన సొమ్ము మీ సేవింగ్స్ ఖాతాలో లేకుంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.