న్యూఢిల్లీ, డిసెంబర్ 29: నిర్ణీత గడువు తేదీ జూలై 31నాటికి ఆదాయపు పన్ను రిటర్న్లు దాఖలు చేయనివారికి మరో చివరి అవకాశం ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్ను డిసెంబర్ 31కల్లా తగిన జరిమానా చెల్లించి ఫైల్ చేసుకోవచ్చు. గడువు తేదీని మిస్ అయినవారు 2023 డిసెంబర్ 31నాటికి ఫైల్ చేయాల్సిందేనని ఆదాయపు పన్ను శాఖ తాజాగా ఎక్స్లో చేసిన పోస్టులో హెచ్చరించింది.
ఆలస్యం చేసిన లేదా సరిదిద్దిన రిటర్న్లను సమర్పించడానికి ఇదే చివరి అవకాశమని తెలిపింది. రూ. 5 లక్షల వార్షిక ఆదాయంగలవారు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేస్తే రూ. 1,000, ఆపైన ఆదాయం ఉన్నవారు రూ. 5,000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా సమర్పించిన రిటర్న్ను మళ్లీ సరిదిద్దుకుని ఫైల్ చేసేవారికి ఫైన్ ఉండదు. ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటేమాత్రం దానికి నెలకు 1 శాతం చొప్పున అపరాధ వడ్డీని కలపి కట్టాలి.