Budget 2022 | కేంద్రంలో 2014లో బీజేపీ సారధ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక బడ్జెట్లో చాలా కీలక మార్పులు జరిగాయి. ముఖ్యంగా లక్షల మందిపై నేరుగా ప్రభావం చూపే ఆదాయం పన్ను (ఐటీ) చెల్లింపుల విధానంలో సవరణలు తీసుకొచ్చింది. మరోపక్క బడ్జెట్ తేదీని కూడా ఫిబ్రవరి ఒకటో తేదీకి మార్చేసింది. బ్రిటిష్ కాలం నుంచి వస్తున్న ‘బడ్జెట్ సూట్కేసు’ సంప్రదాయానికి తెర దించి ఎర్రటి వస్త్రం సంచితో బడ్జెట్ పత్రాలను తెచ్చే సంప్రదాయానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీకారం చుట్టారు.
2014లో తొలిసారి ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బడ్జెట్లో ఆయన ఆదాయం పన్ను మినహాయింపు పరిధిని రూ.2లక్షల నుంచి రూ.2.5లక్షల వరకు పెంచారు. 2014లో సీనియర్ సిటిజన్లకు మినహాయింపును రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షలకు చేరుస్తూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇక 80ఏళ్లు దాటిన వారికి రూ.5లక్షలు చేశారు. సెక్షన్ 8సీ పరిధిని రూ.లక్ష నుంచి రూ.1.5లక్షలకు పెంచగా.. గృహ రుణాల వడ్డీపై పన్ను మినహాయింపును రూ.1.5లక్షల నుంచి రూ. 2లక్షలకు చేర్చారు.
2015లో నాటి విత్త మంత్రి జైట్లీ తన రెండో బడ్జెట్లో పన్ను శ్లాబుల జోలికి వెళ్లలేదు. కేవలం ఆరోగ్య బీమాపై డిడక్షన్ను రూ.15 వేల నుంచి రూ.25వేలకు పెంచారు. ఇక సీనియర్ సిటిజన్లకు ఇది రూ.20 వేల నుంచి రూ.30వేలకు చేర్చారు. దీంతోపాటు ఎన్డీఏ ప్రభుత్వం ట్రాన్స్పోర్టు అలెవెన్స్పై మినహాయింపును కూడా రూ.800 నుంచి రూ.1,600కు చేర్చింది. రూ.కోటికిపైగా ఆదాయం ఉన్న వారిపై సర్ఛార్జిని 10 నుంచి 12 శాతానికి పెంచేసింది. ఈ బడ్జెట్లో సంపద పన్ను తొలగించిన అరుణ్ జైట్లీ 2 శాతం సర్ఛార్జి విధించారు. అత్యంత సంపన్నుల పన్ను ఆదాయం రూ.కోటి దాటితే దీనిని విధించేలా నిబంధనలు పెట్టారు.
2016 బడ్జెట్లో సెక్షన్ 87 ఏ కింద పన్ను రిబేట్ రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ ఆర్థిక మంత్రి జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఆదాయం రూ.5లక్షలు మించని వారికే వర్తిస్తుందనే నిబంధన పెట్టారు. ఆదాయం పన్ను (ఐటీ) చట్టం సెక్షన్ 80జీజీ కింద చెల్లించే ఆద్దెను రూ.24వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. రూ. కోటి వార్షికాదాయం దాటిన వారిపై మరోసారి సర్ఛార్జిని 15శాతం నుంచి 12శాతానికి తగ్గించారు. రూ.10లక్షలు దాటిన డివిడెండ్లపై 10శాతం ఆదాయం పన్ను వేశారు.
2017లో ఈ బడ్జెట్లో ఆదాయం ఉన్న రూ. 2.5లక్షల నుంచి రూ.5లక్షల మధ్యలో ఉన్నవారికి పన్నును 10శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ అరుణ్ జైట్లీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారికి రూ.12,500 వరకు లబ్ధి చేకూరింది. ఐటీ చట్టం సెక్షన్ 87ఏ కింద పన్ను రిబేట్ను కూడా 5,000 నుంచి రూ.2,500 చేశారు. వార్షికాదాయం రూ.3.5లక్షల వరకు ఉన్నవారికి ఇది వర్తిస్తుందన్నారు. దీంతోపాటు వార్షికాదాయం రూ.50లక్షల నుంచి రూ.కోటి మధ్య ఉన్నవారిపై 10శాతం సర్ఛార్జీ విధించారు.
2018లో మెడికల్ రీయింబర్స్మెంట్, ట్రాన్స్పోర్టు అలవెన్స్ల స్టాండర్డ్ డిడక్షన్ పరిధిని రూ.40వేలకు పెంచడంతో సామాన్యూడికి రూ.5,800 వరకు ప్రయోజనం సమకూరింది. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య ఖర్చుల మినహాయింపును రూ.30వేల నుంచి రూ.50వేలకు చేర్చారు అరుణ్ జైట్లీ. మరోపక్క బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపులపై వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపును రూ.10వేల నుంచి రూ.50వేలకు పెంచారు. మరోపక్క అప్పటికే ఆదాయం పన్ను, కార్పొరేట్ పన్నుపై ఉన్న 3శాతం విద్యాసెస్ స్థానంలో 4శాతం విద్య, ఆరోగ్య సెస్ విధించారు. రూ.లక్ష విలువ దాటిన దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధించారు.
2019 బడ్జెట్ నాటికి అనారోగ్యంతో బాధపడుతున్న అరుణ్ జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లారు. దీంతో 2019లో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కావడంతో మధ్యతరగతి వారిపై రూ.5లక్షల వరకు ఆదాయం పన్నుపై రిబేట్ ప్రకటించారు. 2019లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40 వేల నుంచి రూ.50వేలకు పెంచారు.
2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందాక ఏర్పాటైన మోదీ సర్కార్ 2.0లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నియమితులయ్యారు. 2019-20 బడ్జెట్లో ఆదాయం పన్ను శ్లాబ్లపై ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కానీ 2020-21లో మాత్రం న్యూ పర్సనల్ ఐటీ-విధానం తీసుకొచ్చారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డీడీటీ)ని రద్దు చేశారు. నూతన ఐటీ శ్లాబ్లు అందుబాటులోకి తెచ్చారు. రూ.15 లక్షల ఆదాయం వరకు విభిన్న శ్లాబ్ల పన్ను ఖరారు చేశారు. అయితే, ఈ శ్లాబ్ల విధానాన్ని ఎంచుకోవాలా.. పాత విధానాన్ని ఎంచుకోవాలా అనే అంశంపై ఆప్షనల్ అని తేల్చేశారు.
రూ.5-7.5 లక్షల మధ్య ఆదాయం గల వారు 10 శాతం ఐటీ
రూ.7.5 – రూ.10 లక్షల ఆదాయం గల వారు 15 శాతం ఐటీ
రూ.10-12.5 లక్షల మధ్య ఆదాయం గల వారు 20% ఐటీ
రూ.12.5-15 లక్షల మధ్య ఆదాయం గల వారు 25 % ఐటీ
రూ. 15 లక్షల ఆదాయం గల వారు.. 30 శాతం ఐటీ చెల్లించాల్సి ఉంటుంది.