హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): పర్యావరణాన్ని సంరక్షిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉన్న గ్రీన్ బిల్డింగ్స్ భేష్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు అన్నారు. వీటి సాకారంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) కృషి ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్రీన్ బిల్డింగ్ థీమ్తో ప్రాపర్టీ షోను హైదరాబాద్ వేదికగా నిర్వహించడం రాష్ర్టానికి ఎంతో గర్వకారణమన్నారు. ఐజీబీసీ, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా హైటెక్స్లో చేపట్టిన గ్రీన్ బిల్డింగ్ ప్రాపర్టీ షోను శుక్రవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రీనరీ కోసం రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 10 శాతం నిధులను కేటాయిస్తున్నామన్నారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో 260 కోట్ల మొక్కలను నాటామని, ఇది మానవ చరిత్రలోనే 3వ అతిపెద్ద కార్యక్రమంగా నిలిచిందని తెలియజేశారు. పట్టణాల్లోనేగాక మారుమూల గ్రామాల్లోనూ ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నామని, సంప్రదాయ వీధి లైట్ల స్థానంలో పర్యావరణహిత ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు. పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నదని, ఇటీవలే కూల్ రూఫింగ్ పాలసీని తీసుకువచ్చామని, పచ్చదనంలో ప్రపంచస్థాయిలో పలు అవార్డులూ నగరానికి వచ్చాయని గుర్తుచేశారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన చాలా భవనాల్లోనూ గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను పాటించినట్టు ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. నూతన సచివాలయం దగ్గర్నుంచి టీ-హబ్, టీ-వర్క్స్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త జిల్లాల కలెక్టరేట్లు, దవాఖానలు, నూతన పారిశ్రామిక వాడలు, ఐటీ టవర్లదాకా.. ఇలా అన్నింటిలో పర్యావరణ అనుకూల విధానాలను పాటించామని పేర్కొన్నారు. ఇక దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ బిల్డింగ్, గ్రీన్ హోమ్, గ్రీన్ ఎయిర్పోర్టులు తెలంగాణకు గ్వరకారణమన్నారు. ముఖ్యంగా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 1,000 గ్రామాల్లో వరంగల్ జిల్లాలోని గంగదేవిపల్లి గ్రీన్ మోడల్ను అభివృద్ధి చేస్తామన్నారు. నిజానికి ఇప్పటికే హైదరాబాద్లో 10.27 బిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రీన్ బిల్డింగ్ల నిర్మాణం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఐఐ-ఐజీబీసీకి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ భానుప్రసాద్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో-చైర్మన్ శ్రీనివాస మూర్తి, ఐజీబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ వెంకటగిరి, ఐజీబీసీ డిప్యూటి ఈడీ ఎం ఆనంద్లతోపాటు రియల్ ఎస్టేట్ ప్రతినిధులు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ప్రభుత్వ భవనాల్లో సైతం పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంభిస్తున్నది. రాష్ట్రంలోని గ్రీన్ ప్రాజెక్టులకు గొప్ప సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తుండటం అభినందనీయం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు పెద్ద మొత్తంలో ఏర్పాటవుతున్నాయి. వాటిద్వారా భారీగా పెట్టుబడులూ వస్తుండటం ఆనందంగా ఉన్నది. ఇక మా ఈ గ్రీన్ పాపర్టీ షో ద్వారా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి గ్రీన్ సర్టిఫైడ్ ప్రాజెక్టులను తీసుకువస్తున్నాం. గ్రీన్ హౌజ్ ప్రాజెక్టులపై అవగాహన కల్పించేందుకు ఐజీబీసీ నిరంతరం కృషి చేస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో 50 శాతం వరకు ఐజీబీసీ రేటింగ్ కలిగినవే.
-సీ శేఖర్రెడ్డి, సీఐఐ తెలంగాణ, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్
హైదరాబాద్లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు ఎస్బీఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది. స్టార్టప్లను ప్రమోట్ చేసేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందుకోసం ఐటీ కారిడార్లోని నాలెడ్జ్ సిటీలో ప్రత్యేక శాఖనూ ఏర్పాటు చేశాం. బ్యాంకు ద్వారా వేగవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం.
-రాజేశ్ కుమార్, ఎస్బీఐ సీజీఎం