న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేండ్లుగా ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంగా తిరిగి కార్యాలయాల బాట పట్టాల్సిన పరిస్ధితి నెలకొంది. అత్యధిక జీతాలతో వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎఫ్హెచ్)కు అలవాటుపడిన పలువురు ఉద్యోగులు ఈ వెసులుబాటు లేకుంటే ఉద్యోగాన్ని వదులుకునేందుకూ సిద్ధమయ్యారు. కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు డబ్ల్యూఎఫ్హెచ్కు స్వస్తి పలకనున్నట్టు ప్రకటించాయి. అయితే ఈ పద్ధతిని తొలగిస్తే ఉద్యోగాన్ని వీడేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దసంఖ్యలో ఉద్యోగులు చెప్పారని స్టాఫింగ్, రిక్రూట్మెంట్ సంస్ధ సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సర్వే వెల్లడించింది.
సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో ఆరుగురు డబ్ల్యూఎఫ్హెచ్ తొలగిస్తే తాము ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేస్తామని తేల్చిచెప్పారు. ఆఫీసుకు రావాలని కోరితే భారీ జీతాన్ని వదలుకునేందుకు తాము సిద్ధమని ఐటీ, అవుట్సోర్సింగ్, టెక్ స్టార్టప్స్ సహా పలు రంగాల ఉద్యోగులు స్పష్టం చేశారని సర్వే తెలిపింది. తమ పనిసామర్ధ్యంపై ఎలాంటి ప్రభావం చూపకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగ్గా నిర్వహించుకోవడంతో ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి ఉద్యోగులు అలవాటు పడ్డారని సర్వేలో వెల్లడైంది.
ఆఫీసులకు తిరిగి వచ్చే వ్యూహంలో భాగంగానే డబ్ల్యూఎఫ్హెచ్ను పరిగణించాలని సీఐఈఎల్ హెచ్ఆర్ చీఫ్ ఆదిత్య మిశ్రా చెప్పుకొచ్చారు. 620 కంపెనీలకు చెందిన 2000 మందిని తమ సర్వే పలకరించిందని చెప్పారు. వీరిలో 40 శాతం మంది పూర్తిగా ఇంటి నుంచి పనిచేస్తుండగా 26 శాతం హైబ్రిడ్ మోడ్లో పనిచేస్తున్నారు. మిగిలిన ఉద్యోగులు కార్యాలయాల నుంచి పనిచేస్తున్నారు. కాగా వర్క్ ఫ్రం హోంకు తాను అనుకూలం కాదని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ పద్ధతి భారత్కు సరిపడదని కార్యాలయంలో ఉన్న వెసులుబాటు డబ్ల్యూఎఫ్హెచ్లో ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక పలు కంపెనీలు హైబ్రిడ్ మోడ్లో పనిచేసేందుకు ఉద్యోగులను అనుమతిస్తుండగా కార్యాలయాలకు ఉద్యోగులను పిలిచేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, పార్లే ప్రాడక్ట్స్, సన్ ఫార్మా, వోల్టాస్, గోద్రెజ్, గోల్డ్మన్ శాక్స్, డాబర్, హయర్, పానాసోనిక్, బయోకాన్, డిక్సన్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్ధలు సన్నద్ధమయ్యాయి.