న్యూఢిల్లీ : ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ కీలక మైనింగ్ కార్యకలాపాల్లో ట్రాన్స్జెండర్లకు చోటు కల్పించిన తొలి కంపెనీగా అవతరించింది. టాటా స్టీల్ తన గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) ఆపరేటర్లు, క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లకు అవకాశం ఇచ్చిందని కంపెనీ వెల్లడించింది. సమ్మిళిత, వైవిధ్యంతో కూడిన పనిసంస్కృతిని కల్పించే ప్రక్రియలో భాగంగా ట్రాన్స్జెండర్లను టాటా స్టీల్లో ఉద్యోగులుగా ఎంచుకున్నామని తెలిపింది.
అందరికీ తమ సంస్ధల్లో అవకాశం కల్పించాలనే తమ నినాదంలో భాగంగా దాన్ని ఆచరణలో చూపుతున్నామని పేర్కొంది. వెస్ట్ బొకారో డివిజన్లో గత ఏడాది డిసెంబర్లో టాటా స్టీల్ తమ గనుల్లో హెచ్ఈఎంఎం ఆపరేటర్లుగా 14 మంది ట్రాన్స్జెండర్లను నియమించిందని స్టీల్ దిగ్గజం పేర్కొంది.
ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో కళింగనగర్ ప్లాంట్లో 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ఎల్జీబీటీ+ కమ్యూనిటీకి చెందిన వారిని ఎంపిక చేసింది. రుతుస్రావ సమయంలో సెలవల మంజూరుతో పాటు, ట్రాన్స్జెండర్లను ఉద్యోగులుగా నియమించడం వంటి పలు చర్యలు పనిసంస్కృతి మెరుగుదల కోసం చేపడుతున్నామని టాటా స్టీల్ తెలిపింది. 2025 నాటికి మొత్తం ఉద్యోగుల్లో 25 శాతం మంది వైవిధ్య సిబ్బంది ఉండేలా లక్ష్యం నిర్ధేశించుకున్నామని వెల్లడించింది.