న్యూఢిల్లీ, అక్టోబర్ 12: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,833 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,487 కోట్ల లాభంతో పోలిస్తే 9.9 శాతం అధికమని పేర్కొంది. హెచ్సీఎల్ టెక్నాలజీ కూడా ఇన్ఫోసిస్ మాదిరిగానే ఆదాయ అంచనాల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వృద్ధి 5-6 శాతం మధ్యలో నమోదుకానున్నట్టు గైడెన్స్లో పేర్కొంది. గతంలో 6-8 శాతంగా ఉంటుందని అంచనావేసిన సంస్థ..ఈసారికి దీనిని కుదించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 8 శాతం ఎగబాకి రూ.26,672 కోట్లకు చేరుకున్నది. గత త్రైమాసికంలో అన్ని విభాగాలు అంచనాలకుమించి రాణించాయి..ఆపరేటింగ్ మార్జిన్లలో 18.5 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ సీఈవో, ఎండీ సీ విజయకుమార్ తెలిపారు.