Gold Imports | తొలి నుంచి నుంచి బంగారం అంటే మన వాళ్లకు.. ప్రత్యేకించి మగువలకు ఎంతో ఇష్టం. ప్రతి పండక్కి.. శుభకార్యానికి వీలైతే పిసరంత బంగారం కొనుక్కోవడానికి తహతహలాడుతుంటారు. కానీ దేశీయ డిమాండ్కు అనుగుణంగా బంగారం ఉత్పత్తి లేదు. దేశీయ అవసరాలు, గిరాకీని అందుకోవాలంటే అత్యధిక శాతం దిగుమతి చేసుకోవడమే శరణ్యం. బంగారం దిగుమతిపైనే పూర్తిగా ఆధారపడ్డ భారత్లో దానిపై దిగుమతి సుంకాలు పెంచినా గిరాకీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సుంకాలు పెంచడం వల్ల స్మగ్లింగ్కు, గ్రే మార్కెట్, బ్లాక్ మార్కెటింగ్కు బంగారం వ్యాపారం మళ్లుతుందని బిలియన్ వర్గాలు వెల్లడించిన ఆందోళనలు పటా పంచలయ్యాయి. 2016-2020 మధ్య 86 శాతం బంగారం దిగుమతి చేసుకుంటే, 13 శాతం ఆభరణాలు, జ్యువెల్లరీ, పాత బంగారం రీసైక్లింగ్ చేశారు. ఒక్కశాతం మాత్రమే దేశంలోని బంగారం గనుల్నుంచి వెలికి తీశారు.
2012లో తొలిసారి దిగుమతిపై ఎక్సైజ్ సుంకం పెంచినప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 6581 టన్నుల బంగారం దిగుమతైంది. సగటున ఏడాదికి 730 టన్నులు దిగుమతైందని తెలుస్తోంది. అధిక దిగుమతి సుంకం వసూలు చేస్తున్నా అధికారికంగానే బంగారం దిగుమతులు పెరిగిపోతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2012లో ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పటి నుంచి సగటున 760 టన్నుల బంగారం దిగుమతి అవుతున్నది.
ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో తూర్పు, ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలకు అనధికారిక బంగారం దిగుమతులు పెరిగాయని సమాచారం. స్మగ్లింగ్ రూట్లలో బంగారం ఈ రాష్ట్రాల్లోకి వచ్చి పడినట్లు తెలుస్తోంది. గతంలో జల మార్గాల మీదుగా సాగే బంగారం స్మగ్లింగ్.. ఇప్పుడు విమానాలు, రోడ్డు మార్గాలకు మళ్లిందని వినికిడి.
తక్కువ కస్టమ్స్ సుంకాలు విధించడంతో గత దశాబ్ది కాలంలో బంగారం దిగుమతులు పెరిగాయని తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోకెల్లా రెండో అతిపెద్ద బంగారం దిగుమతి మార్కెట్ భారత్ అని భారత్ డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో పీఆర్ సోమసుందరం చెప్పారు.
భారత్ పూర్తిగా బంగారం, బులియన్ దిగుమతులపైనే ఆధారపడి ఉంటుందని సోమసుందరం వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా దేశీయ బులియన్ పరిశ్రమ సంఘటిత రిఫైనరీ సామర్థ్యాన్ని సమకూర్చుకోగలిగిందన్నారు. అయితే బంగారం వ్యాపారం ముంగిట సవాళ్లు కూడా యథాతథంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో బ్యాంకులు మరింత చురుకైన పాత్ర పోషించడానికి బంగారం నిల్వల వనరులు, ఆర్గనైజ్డ్ ట్రేడింగ్ అడ్డంకులుగా మారాయి. గ్లోబల్ ట్రేడింగ్, ప్రైస్ సెట్టింగ్పైనే బులియన్ వ్యాపారం ఆధార పడి ఉంటుంది.
బులియన్పై అధిక పన్నులు.. గ్రేమార్కెట్కు మంచి ప్రోత్సాహకాలుగా ఉన్నాయి. బంగారాన్ని ద్రవ్య రూపంలోకి, మెయిన్స్ట్రీమ్లోకి తేవడానికి అవసరమైన సంస్కరణలపై బులియన్ వర్గాలు, ప్రభుత్వం నిరంతరం చిన్నచూపే చూస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఇక అత్యధిక బంగారం దిగుమతులతో దేశీయ వాణిజ్య సమతుల్యతపై ప్రతికూల ప్రభావం చూపుతూ ఉంటుంది. వాణిజ్య లోటు తగ్గింపుకే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిని నిరుత్సాహ పరుస్తూ ఉంటుంది.
గతేడాది 377 టన్నుల బంగారం బార్లు, ఇతర బంగారం 30కి పైగా దేశాల నుంచి దిగుమతి చేశారు. కానీ వాటిలో 55 శాతం కేవలం రెండు దేశాల నుంచే జరిగింది. స్విట్జర్లాండ్ నుంచి 44 శాతం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి 11 శాతం బంగారం దిగుమతైంది. మూడింట బంగారం దిగుమతులు 995 కాస్ట్ కిలో బార్స్ లేదా 100 గ్రాముల బార్ల రూపంలో వస్తుంది. 999 ప్యూరిటీ గల బంగారం బార్లు దిగుమతుల్లో మూడో వంతు ఉంటాయి.
గత కొన్నేండ్లుగా 100 గ్రాముల బంగారం బార్లు పాపులారిటీ పొందాయి. చిన్న డీలర్లు, తయారీ దారుల నుంచి 100 గ్రాముల బంగారం కడ్డీల కోసం గిరాకీ పెరిగింది. భారత్లోని 11 నగరాల్లోకి బంగారం దిగుమతి అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని సత్యవేడులో గల శ్రీసిటీ ఎఫ్టీడబ్ల్యూజడ్కు బంగారం దిగుమతి అవుతుంది. 2020లో 84 శాతం దిగుమతులు ఉత్తర, దక్షిణ భారత విమానాశ్రయాల నుంచి దిగుమతి అయితే మిగతా 16 శాతం పశ్చిమ, తూర్పు భారత్ ప్రాంతాల విమానాశ్రయాల నుంచి దిగుమతైంది.