న్యూఢిల్లీ, జనవరి 8: దేశంలో శరవేగంగా వ్యాప్తిచెందుతున్న కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నది. కొవిడ్ తొలి, రెండో వేవ్లతో అతలాకుతలమైన షాప్లు, మార్కెట్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు, వాణిజ్య సముదాయాలపై తాజాగా పలు రాష్ర్టాలు విధిస్తున్న ఒమిక్రాన్ ఆంక్షలతో ఇవి మళ్లీ కుదేలవుతున్నాయి. వివిధ రాష్ర్టాలు రాత్రిపూట కర్ఫ్యూలు విధించడం, పనిగంటల్ని తగ్గించడం, వినియోగదారుల సంఖ్యపై పరిమితి విధించడం వంటి అంశాలతో అమ్మకాలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ర్టాలు ఇప్పటికే పలు నియంత్రణల్ని అమలు చేస్తున్నాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మాల్స్,షాప్లు వాటి నెంబర్ల ఆధారంగా రోజు విడిచి రోజు తెరిచేందుకు మాత్రమే అనుమతించింది. పనివేళల్ని ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకూ పరిమితం చేసింది. సినిమాహాళ్లు, జిమ్ల మూసివేతకు ఆదేశించి, రెస్టారెంట్లు, బార్లు 50 శాతం సామర్థ్యంతో రాత్రి 10 గంటలవరకూ మాత్రమే నడిపేందుకు అనుమతించింది. కర్ణాటకలో మాల్స్, దుకాణాల్ని తెరిచి ఉంచే సమయాల్ని తగ్గించారు. ఆయా రాష్ర్టాల్లో వ్యాపారాలపై నియంత్రణల ప్రభావంపై ఏమంటున్నారంటే…
కర్ణాటకలో వ్యాపార వేళల్ని తగ్గించడంతో గతవారంతో పోలిస్తే ఈ వారం తమ అమ్మకాలు 10-15 శాతం పడిపోయాయని హోల్సేల్ చైన్ మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఎండీ అరవింద్ మెడిరట్ట చెప్పారు.ఢిల్లీలో నియంత్రణలతో అమ్మకాలు 50 శాతం వరకూ తగ్గొచ్చని సెలక్ట్ సిటీవాక్ మాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యోగేశ్వర్ శర్మ అన్నారు. సినిమాలు, ఫిట్నెస్ సెంటర్ల కోసం మాల్స్కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతున్నదన్నారు.
కొవిడ్ ముందస్తు స్థాయి (2019)కంటే 2021 అక్టోబర్లో 14 శాతం, నవంబర్లో 9 శాతం మేర అమ్మకాలు పెరిగాయి. అదంతా తాజా నియంత్రణలతో ఆవిరైపోయిందని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ కుమార్ రాజగోపాలన్ వెల్లడించారు. రాత్రి కర్ఫ్యూలు వ్యాపారంతోపాటు వినియోగదారుల సెంటిమెంట్ను కూడా దెబ్బతీస్తుందన్నారు.