న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్నదని ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్)లు వరుస హెచ్చరికలు జారీచేశాయి. 2023లో పలు దేశాల్లో మాంద్యం కమ్మేస్తుందని, కొన్ని దేశాల్లో పేరుకి జీడీపీ వృద్ధి కనబడినా ప్రజలు మాంద్యంలో ఉన్నట్టే ఉక్కిరిబిక్కిరి అవుతారంటూ ఈ రెండు సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర బ్యాంక్లు ఒకేసారి ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నందున, ఆర్థిక మాంద్యం ఆవరిస్తుందని ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇప్పటికే పలు సంకేతాలు కన్పిస్తున్నాయని, 1970 తర్వాత ఎన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థలు వేగంగా మందగిస్తున్నాయన్నది.
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అంతర్జాతీయ వడ్డీ రేట్లను కేంద్ర బ్యాంక్లు 4 శాతానికి పెంచివేస్తాయని, 2021కంటే ఇవి రెట్టింపవుతాయని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. అమెరికా నుంచి యూరప్, ఇండియా వరకూ పలు దేశాలు వడ్డీ రేట్లను వేగంగా పెంచుతున్నాయని, ఇలా ద్రవ్య విధానం కఠినతరంకావడంతో పెట్టుబడులు తగ్గిపోతాయని, ఉద్యోగాలు పోతాయని, వృద్ధి కుంచించుకుపోతుందని, ఇండియాతో సహా పలు దేశాలు వాణిజ్య అవకాశాల్ని కోల్పోతాయంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఈ పరిణామాలు దీర్ఘకాలంపాటు ప్రజల్ని బాధిస్తాయని, ముఖ్యంగా వర్థమాన, అభివృద్ధిచెందుతున్న దేశాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందంటూ ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
మూడో త్రైమాసికంలో మరింత మందగమనం
అధిక ద్రవ్యోల్బణం, సరఫరా సమస్యలు, ఫైనాన్షియల్ మార్కెట్లు కఠినంగా మారడంతో ప్రస్తుత మూడో త్రైమాసికంలో (2022 జూలై-సెప్టెంబర్) ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత మందగించినట్లు వివిధ గణాంకాల ద్వారా వెల్లడవుతున్నదని ఐఎంఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ చెప్పారు. వాషింగ్టన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2023లో కొన్ని దేశాలు మాంద్యంలో చిక్కుకుంటాయని అంచనా వేస్తున్నామన్నారు. అయితే ప్రపంచ ఆర్థికాభివృద్ధిపై ఐఎంఎఫ్ అంచనాల్ని సవరించేదీ, లేనిదీ రైస్ వెల్లడించలేదు. గ్లోబల్ వృద్ధి 2022లో 3.2 శాతానికి, 2023లో 2.9 శాతానికి తగ్గిస్తూ జూలైలో ఐఎంఎఫ్ అంచనాల్ని విడుదల చేసింది. తదుపరి అంచనాల్ని వచ్చే నెలలో వెల్లడించనుంది. గడచిన కొద్ది నెలలు, వారాల్లో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తీవ్రతరమయ్యిందని ఐఎంఎఫ్ ప్రతినిధి తెలిపారు. చైనా ఆర్థిక కార్యకలాపాల్ని కొవిడ్-19, రియల్ ఎస్టేట్ సమస్యలు దెబ్బతీస్తున్నాయని, డాలరు పటిష్టత పలు దేశాల్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. కొన్ని దేశాలు సాంకేతికంగా మాంద్యంలోకి రానప్పటికీ, ప్రపంచమంతటా ప్రజలు మాంద్యంలో ఉన్నట్లుగానే ఉక్కిరిబిక్కిరి అవుతారన్నారు. కేవలం ఆఫ్రికాలోనే గత రెండేండ్లుగా 12.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు.