న్యూఢిల్లీ : 2025 నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదుగుతుందని, ఈ దిశగా కసరత్తు సాగుతోందని మోదీ సర్కార్ గత మూడేండ్లుగా చెబుతోంది. అయితే మన ఆర్ధిక వ్యవస్ధ ఈ కీలక మైలురాయిని చేరుకోవాలంటే అదనంగా మరో నాలుగేండ్లు పడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2019లో మహమ్మారికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్ధిక వ్యవస్ధను ఆరేండ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరే లక్ష్యంతో ముందుకెళ్లాలని కోరారు.
అయితే 2029 ఆర్ధిక సంవత్సరం నాటికి భారత జీడీపీ ఈ మైలురాయిని అందుకుంటుందని ఐఎంఎఫ్ తాజా డేటాబేస్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ ముఖ్య ఆర్ధిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ సైతం మన ఆర్ధిక వ్యవస్ధ 2025 ఆర్ధిక సంవత్సరంలో 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి విజృంభణతో ఆర్ధిక వ్యవస్ధ కుదేలవడం కూడా కీలక మైలురాయి దిశగా భారత్ ప్రస్ధానంపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు ఉక్రెయిన్పై రష్యా దమనకాండ నేపధ్యంలో 2023 ఆర్ధిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాను ఏప్రిల్లో వెల్లడించిన ఐఎంఎఫ్ నివేదిక 8.2 శాతానికి కుదించింది.