IMF on India GDP | భారత ఆర్థిక వృద్ధిరేటుపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనాల్లో కోత విధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు తొమ్మిది శాతానికే పరిమితం అని పేర్కొన్నది. కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావంతో బిజినెస్, మొబిలిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని మంగళవారం తెలిపింది. ఈ మేరకు ఐఎంఎఫ్.. వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్ అనే పేరుతో నివేదికను వెల్లడించింది. గత అక్టోబర్లో భారత్ జీడీపీ వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ వ్యాక్యానించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.1 శాతానికే పరిమితం అవుతుందని అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతానికి పడిపోయింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 9.2 శాతానికంటే తక్కువ నమోదవుతుందని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ గణాంకాలను ఉటంకిస్తూ ఐఎంఎఫ్ అంచనా వేసింది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) 9.5 శాతం జీడీపీ నమోదవుతుందని పేర్కొన్నది. ఎస్ అండ్ పీ కూడా 9.5 శాతం, మూడీస్ 9.3 శాతం జీడీపీ నమోదవుతుందని తెలిపినా ఐఎంఎఫ్ తగ్గించడం గమనార్హం. అయితే ప్రపంచ బ్యాంక్ అంచనా 8.3 శాతం, ఫిచ్ అంచనా 8.4 శాతం కంటే ఎక్కువ.
అయితే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ గ్రోత్లో పురోగతి నమోదవుతుందని, ఇన్వెస్ట్మెంట్, వినియోగ రంగాల్లో మెరుగుదల ఉంటుందని అంచనా వేసింది ఐఎంఎఫ్. గ్లోబల్ గ్రోత్ 2021తో పోలిస్తే 2022లో 5.9 శాతం నుంచి కాస్త తగ్గి 4.4 శాతానికి చేరుతుందని అంచనా. 2023లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి.. 3.8 శాతానికి పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.