IMF on India Growth | ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మరోమారు కోత విధించింది. ఇంతకుముందు అంచనాతో పోలిస్తే 60 బేసిక్ పాయింట్లు తగ్గించి 6.8 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయంగా డిమాండ్ లేకపోవడంతో ఏప్రిల్-జూన్ (రెండో త్రైమాసికం) మధ్య వృద్ధిరేటు మందగించిందని పేర్కొంది. ఇంతకుముందు జూలైలో 80 బేసిక్ పాయింట్లు తగ్గించి భారత్ వృద్ధిరేటు 7.4 శాతం ఉంటుందని ప్రకటించింది. ప్రపంచ వృద్ధిరేటు ఈ ఏడాది 3.2 శాతంగా కొనసాగినా.. 2023లో 2.7 శాతానికి, రెండు శాతం కంటే తక్కువకు పడిపోవచ్చునని ఐఎంఎఫ్ హెచ్చరించింది.
ఐఎంఎఫ్తోపాటు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), వరల్డ్ బ్యాంక్ తదితర ఆర్థిక సంస్థలు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సర భారత్ వృద్ధిరేటులో కోత విధించాయి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ 6.1 శాతం యథాతథంగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ ప్రకటించింది.
ఇంతకుముందు భారత్ వృద్ధిరేటు 7.5 శాతం ఉంటుందని పేర్కొన్న ఎస్బీఐ.. ఇటీవల 6.8 శాతానికి పరిమితం చేసింది. ప్రపంచ బ్యాంక్ 7.5 శాతం నుంచి 6.5 శాతానికి కుదించింది. ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ సిటీ గ్రూప్ ఎకాఎకీన ఎనిమిది శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించేసింది. ఫిచ్ 7.8 నుంచి ఏడు శాతానికి, ఇండియా రేటింగ్స్ ఏడు నుంచి 6.9, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.2 నుంచి ఏడు శాతానికి, ఆర్బీఐ 7.2 నుంచి ఏడు శాతానికి పరిమితం చేశాయి.
2022 కంటే 2023లో పలు ఆర్థిక వ్యవస్థల (పలు దేశాలు) పరిస్థితి దారుణంగా ఉంటుందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. ద్రవ్య లభ్యత కఠినతరం కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది. 2022లో గ్లోబల్ ద్రవ్యోల్బణం 8.8 శాతానికి దూసుకెళ్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధిరేటు అంచనా వేసిన దానికంటే తక్కువ నమోదవుతుందని పేర్కొంది.