న్యూఢిల్లీ : ఆర్ధిక సంక్షోభం భయాలు వెంటాడుతుండటంతో గత కొద్దినెలలుగా పలు కంపెనీలు వేలాది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోతున్న పలువురు తమ కథనాలను లింక్డిన్, ట్విట్టర్లో పోస్ట్ చేస్తుండగా వీరిలో కొందరు కొత్త ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. కొలువులు కోల్పోయిన మరికొందరు టెకీలు మరో జాబ్ కోసం ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.
తాజాగా శుభం సాహు అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ మాస్ లేఆఫ్స్లో బాధితుడిగా మారాడు. గోల్డ్మన్ శాక్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సాహు కంపెనీలో చేరిన ఆరు నెలలకే ఉద్యోగం కోల్పోయాడు. సాహు తాను కొలువు కోల్పోయిన ఉదంతాన్ని లింక్డిన్లో పోస్ట్ చేశాడు. ఇది తన తొలి జాబ్ అని, 2023 ఇలా ప్రారంభమవుతుందని తాను ఊహించలేదని రాసుకొచ్చాడు.
జనవరి 11న తనను సాఫ్ట్వేర్ ఇంజనీర్ (బ్యాకెండ్ డెవలపర్) రోల్ నుంచి తొలగించారని పేర్కొన్నాడు. 2022లో ఐఐటీ ఖరగ్పూర్ నుంచి కెమికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్గా సాహు బయటకు వచ్చాడు. గోల్డ్మన్ శాక్స్లో తాను కొన్ని నెలలే పనిచేసినా ఎన్నో విషయాలు తెలుసుకుని నేర్చుకునే అవకాశం లభించిందని చెప్పుకొచ్చాడు. ఇక భారత్లోనూ గోల్డ్మన్ శాక్స్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించనుందని రిపోర్ట్స్ వెల్లడయ్యాయి.