IIT Placements | కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల పరిశ్రమల్లో డిజిటలైజేషన్ శరవేగంగా సాగుతున్నది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిదశ ప్లేస్మెంట్స్లోనే ప్రతి సంస్థ విద్యార్థులకు ఆఫర్లు లభిస్తున్నాయి. అసాధారణ రీతిలో టెక్ టాలెంట్కు డిమాండ్ పెరిగింది. తత్ఫలితంగా టెక్నాలజీ నిపుణులకు ఆఫర్ల వరద వెల్లువెత్తుతున్నది. ఐఐటీయన్ల ప్రతిభకు కార్పొరేట్ దిగ్గజాలు పట్టం కడుతున్నాయి. దేశంలోని టాప్ -8 ఐఐటీల్లో విద్యాభ్యాసం చేసిన విద్యార్థుల క్యాంపస్ సెలక్షన్లలో రికార్డులు నమోదయ్యాయి.
దేశీయంగా అత్యధికంగా రూ.1.8 కోట్ల ప్యాకేజీ లభిస్తే.. అంతర్జాతీయ సంస్థలు రూ.2.15-2.4 కోట్ల వేతన ప్యాకేజీ లభించింది. దేశీయ సంస్థల నుంచి వేతన ప్యాకేజీ దాటడం ఇదే ఫస్ట్ టైం. ఐఐటీ పూర్తి చేసుకున్న విద్యార్థుల టాలెంట్ను బట్టి వేతన ప్యాకేజీలు ఖరారవుతున్నాయి. ఐఐటీ-ఢిల్లీ, ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-ఖరగ్పూర్, ఐఐటీ-రూర్కే, ఐఐటీ-గువాహటి, ఐఐటీ- వారణాసిల్లో రికార్డు స్థాయిలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటున్న 185 మంది విద్యార్థులకు రూ.కోటి పై చిలుకు వేతన ప్యాకేజీలు లభించాయి.
ఐఐటీ-ఢిల్లీ క్యాంపస్ సెలక్షన్లలో 60 మందికి రూ.కోటికి పైగా వేతన ప్యాకేజీ లభించింది, ఇతర ఐఐటీల్లో కాన్పూర్ (49), మద్రాస్ (27), బాంబే (12), రూర్కే (11), గువాహటి (5), బీహెచ్యూ లో ఒకరు రూ.కోటి ప్యాకేజీ అందుకున్నారు. 22 మందికి పైగా విద్యార్థులకు రూ.90 లక్షల నుంచి రూ.2.4 కోట్లు, ఒకరిద్దరికి రూ.90 లక్షల నుంచి రూ.కోటి ప్యాకేజీ లభించిందని ఐఐటీ ఖరగ్పూర్ తెలిపింది. ఐఐటీ-ఢిల్లీ కెరీర్ సర్వీసెస్ ఆఫీసర్ అనిష్యా ఒబెరాయ్ మదన్ ఎంత మంది ఎంపికయ్యారన్న సంగతి వెల్లడించలేదు. తొలిసారి కొన్ని సంస్థలు అంతర్జాతీయ సంస్థలకు అధిక వేతన ప్యాకేజీతో విద్యార్థులను ఎంపిక చేశాయన్నారు.
ఐఐటీ-మద్రాస్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అడ్వైజర్ సీఎస్ శంకర్ రామ్ మాట్లాడుతూ తమ సంస్థలో 27 మంది విద్యార్థులకు రూ.కోటిపైగా వేతన ప్యాకేజీలు లభించాయని చెప్పారు. ఐఐటీ గువాహటి, ఐఐటీ బీహెచ్యూ క్యాంపస్లు కూడా గత బ్యాచ్ల్లో రూ.కోటి ప్యాకేజీ వేతనాలు పొందిన విద్యార్థులు లేరన్నారు.