హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన నూనెల ఉత్పత్తిని పెంచేలా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. శరీరానికి అవసరమైన మంచి కొవ్వులకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా నూనెను వెలికితీసే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎంతో శాస్త్రీయంగా జరిగే ఈ విధానం ద్వారా నూనె గింజల నుంచి వంద శాతం నూనెను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని ఐఐసీటీ వర్గాలు తెలిపాయి. ఐఐసీటీలో జరుగుతున్న వన్ వీక్-వన్ ల్యాబ్ కార్యక్రమంలో నూతన సాంకేతికతలను ప్రదర్శిస్తున్నారు. నూనెల తయారీ ప్లాంట్ నమూనా, దాని ప్రత్యేకతను బుధవారం ఐఐసీటీ సిబ్బంది తిరుపతి, రవీందర్, శివశంకర్ వివరించారు.
నిజానికి పల్లీ, నువ్వులు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలతో పోల్చితే వడ్లను శుద్ధి చేయగా వచ్చే తవుడు (రైస్ బ్రాన్)లో పుష్కలమైన పోషకాలు ఉంటాయని ఐఐసీటీ ఈ సందర్భంగా వివరించింది. దీని నుంచి సేకరించిన నూనెలోనూ అదే తరహాలో హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ ఉంటుందన్నది. కాగా, నిత్యం 100 టన్నుల ఉత్పాదక సామర్థ్యం తమ టెక్నాలజీతో నడుస్తున్న ప్లాంట్లకు ఉంటుందని.. తెలంగాణ, ఏపీల్లో ఇలా 16 ప్లాంట్లున్నాయని ఐఐసీటీ తెలియజేసింది. రాష్ట్రంలో 8 ప్లాంట్లున్నట్టు వివరించింది. ఇక ఏటా దేశవ్యాప్తంగా 12.5 లక్షల టన్నుల నూనె వినియోగం ఉండగా.. ఇందులో 6 లక్షల టన్నుల నూనె ఐఐసీటీ డెవలప్ చేసిన టెక్నాలజీతోనే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. ఈ కార్యక్రమం ఈ నెల 12 వరకు జరుగనుంది. దీన్ని ఉచితంగానే సందర్శించవచ్చు.