Paytm | పేటీఎం పేమెంట్స్ బ్యాంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం బ్యాంక్ను తొలగించింది. ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఐహెచ్సీఎల్ ఈ నిర్ణయం తీసుకున్నది. తాము ప్రకటించిన 32 బ్యాంకుల నుంచే ఫాస్టాగ్లు తీసుకోవాలని సూచించింది. ఈ 32 అధీకృత బ్యాంకుల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యస్ బ్యాంక్ సహా మరికొన్ని బ్యాంకులున్నాయి.
అయితే, భారత్లో ఎనిమిది కోట్ల మందికిపైగా ‘ఫాస్టాగ్’ వినియోగదారులు ఉన్నారని.. ఇందులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL) మార్కెట్ వాటా దాదాపు 30శాతంగా ఉందని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంతకు ముందు ఐహెచ్సీఎల్ గతేడాది జనవరి 19న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్త ఫాస్టాగ్ల జారీని నిలిపివేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఫిబ్రవరి 29 తర్వాత కొత్త అకౌంట్స్, డిపాజిట్లు, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరుపొద్దని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, నిబంధనలు పాటించకపోవడంతో ఆదేశాలు జారీ చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు తాజా ఫాస్టాగ్ కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయడానికి ‘ఫాస్టాగ్’ యూజర్స్ను ప్రోత్సహిస్తున్నట్లు ఐహెచ్సీఎల్ పేర్కొంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, త్రిసూర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సరస్వత్ బ్యాంక్, నాగ్పూర్ నాగరిక్ కో-ఆపరేటివ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, జేఅండ్కే బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఫినో బ్యాంక్, ఈక్విటబుల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కాస్మోస్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంలకు ‘ఫాస్టాగ్’ సేవలు అందిస్తున్నాయి. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికతతో కూడిన ‘ఫాస్టాగ్’ లింకయిన బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా హైవేటోల్ ఫీజులు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది.