హైదరాబాద్, ఏప్రిల్ 1: దేశంలో తొలి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సెంటర్ (ఏడీఆర్)ను వచ్చే మూడు నెలల్లో హైదరాబాద్లో ప్రారంభించబోతున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) జాతీయ ప్రెసిడెంట్ మనీష్ గుప్తా తెలిపారు. హైదరాబాద్లో జరిగిన ఓ సదస్సుకు ముఖ్య అథిధిగా హాజరైన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టు కింద తొలుత హైదరాబాద్లో ఏడీఆర్ను ఎంపిక చేసుకోగా..తదుపరి దశలో కోల్కతా, మానెసర్, ముంబైలకు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
పలు మెట్రో నగరాల్లో మౌలిక సదుపాయాలను ముందుగా పరిశీలించిన తర్వాతనే ఏడీఆర్ సెంటర్ కోసం హైదరాబాద్ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పారు. ఇక్కడ మౌలిక సదుపాయాలతోపాటు భౌగోళిక అంశాలు అనుకూలంగా ఉండటం కూడా ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. మరోవైపు, అర్బిట్రేషన్, ఫోరెన్సిక్ ఆడిటింగ్, కార్పొరేట్ గవర్నెన్స్లో కృత్రిమ మేధస్సు, ఈఎస్ఈ వంటి నూతన కోర్సులను ఇటీవల ప్రవేశపెట్టింది. మరిన్ని నూతన కోర్సులను ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్న ఐసీఎస్..తాజాగా తెలంగాణకు చెందిన ఓయూ, నల్సర్, కాకతీయలతో ఒప్పందం చేసుకోనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 200కి పైగా యూనివర్సిటీలతో జట్టు కట్టింది.