పెద్ద లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే వీలు
న్యూఢిల్లీ, మార్చి 24: ప్రైవేటు రంగంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వస్తువుల కొనుగోలు లేదా ఇతర చెల్లింపుల కోసం ఐసీఐసీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు జరిపే ఖాతాదారులు సదరు మొత్తాన్ని సులభమైన ఈఎంఐ (నెలవారీ కిస్తీ)లుగా విభజించుకునేందుకు వీలుకల్పించింది. బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావడం ఇదే తొలిసారని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. రూ.5 లక్షల్లోపు విలువైన లావాదేవీలకు ఈ సదుపాయం వర్తిస్తుందని బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గ్యాడ్జెట్ల కొనుగోళ్లు, బీమా ప్రీమియం లేదా స్కూల్ ఫీజుల చెల్లింపు లాంటి అవసరాల కోసం పొదుపు ఖాతాలను ఉపయోగించి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా లావాదేవీలు జరిపే కస్టమర్లు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే సులభమైన ఈఎంఐల సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించింది. ఆన్లైన్ పేమెంట్ గేట్వేలైన బిల్డెస్క్, రేజర్పే సంస్థలతో కలిసి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నది. ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్లు, ఇన్సూరెన్స్, ట్రావెల్, ఎడ్యుకేషన్-స్కూలు ఫీజులు, ఎలక్ట్రానిక్ చైన్ల లాంటి వెయ్యికిపైగా క్యాటగిరీల్లోని వ్యాపార సంస్థలను తన ప్లాట్ఫామ్ పరిధిలోకి తీసుకొచ్చి ఈ సదుపాయాన్ని మొదలుపెడుతున్నట్లు ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది.