హైదరాబాద్, ఫిబ్రవరి 2: వసూలయ్యే ప్రతీ వంద రూపాయల పన్ను కోసం ఆదాయం పన్ను (ఐటీ) శాఖకు 57 పైసల ఖర్చవుతున్నదని హైదరాబాద్ ఐటీ శాఖ చీఫ్ కమిషనర్ శిశిర్ అగర్వాల్ తెలిపారు. గురువారం ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) కేంద్ర బడ్జెట్పై నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ పన్ను వసూళ్ల కోసం ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఖర్చు చేస్తున్న ఆయా దేశాల్లో భారత్ కూడా ఒకటన్నారు.
బ్రిటన్లో 73 పైసలు, జపాన్లో 174 పైసలు, జర్మనీలో 135 పైసలు, కెనడాలో 150 పైసలు, ఫ్రాన్స్లో 111 పైసల చొప్పున ఖర్చవుతున్నట్టు పేర్కొన్నారు. భారత్ కంటే తక్కువ ఖర్చవుతున్న దేశం అమెరికానేనన్నారు. ఇదిలావుంటే దాఖలయ్యే ఐటీ రిటర్నుల్లో 65 శాతం రిటర్నుల ప్రాసెసింగ్, రిఫండ్ 24 గంటల్లోనే జరిగిపోతున్నట్టు వివరించారు.