Hyundai-Kia-Exide | విద్యుత్ కార్లలో బ్యాటరీల తయారీ విషయమై దక్షిణ కొరియా ఆటోమొబైల్ సంస్థలు హ్యుండాయ్ మోటార్, దాని అనుబంధ సంస్థ కియా కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. భారత్లో బ్యాటరీల తయారీ సంస్థ ‘ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్’తో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో దేశీయంగా తయారయ్యే విద్యుత్ కార్లలో వినియోగించే బ్యాటరీలను స్థానికంగానే సమీకరించాలని నిర్ణయించాయి. భారత్ లో విద్యుత్ కార్ల మార్కెట్ విస్తరణ దిశగా ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని హ్యుండాయ్ మోటార్ ఓ ప్రకటనలో తెలిపింది.
కర్బన ఉద్గారాల నియంత్రణ ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్రం ముందుకెళుతుండటంతో ఎలక్ట్రిక్ కార్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్నది. విద్యుత్ కార్లలో వినియోగించే బ్యాటరీలను దేశీయంగా సేకరించడం వల్ల తమ ఖర్చులు తగ్గించుకునేందుకు వీలు ఉందని హ్యుండాయ్ మోటార్ అండ్ కియా ఆర్ అండ్ డీ డివిజన్ అధిపతి హేవాన్ యాంగ్ తెలిపారు. భారత్ మార్కెట్లో విడుదల చేసే విద్యుత్ కార్లలో స్థానిక బ్యాటరీల వినియోగం ద్వారా ఈవీ కార్ల మార్కెట్లో అగ్రగామిగా నిలవడమే తమ లక్ష్యం అని హ్యుండాయ్ మోటార్ వెల్లడించింది.
ప్రస్తుతం దేశీయంగా ఐయానిక్ 5, కోవా, కియా ‘ఈవీ6’ విద్యుత్ కార్లను విక్రయిస్తున్నాయి. 2025లో కొత్త విద్యుత్ కారును మార్కెట్లోకి తేవడానికి హ్యుండాయ్ మోటార్ సన్నాహాలు చేస్తున్నది. ఇదిలా ఉంటే యాసిడ్ బ్యాటరీల తయారీలో ఎక్సైడ్ ఎనర్జీ ఏండ్ల తరబడి అగ్రగామిగా నిలుస్తున్నది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థే ‘ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్. 2022లో లిథియం-ఐయాన్ సెల్స్ తయారీ రంగంలో ఎక్సైడ్ ఎంటరైంది.