హైదరాబాద్, నవంబర్ 19: వర్కింగ్ వుమెన్..ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న మహిళలు లీడర్షిప్ హోదాల్లోకి ఎదిగేందుకు సహాయపడే కార్యక్రమాన్ని హైదరాబాద్ సాఫ్ట్వేర్ సంస్థల అసోసియేషన్ హైసియా ప్రారంభించింది. ‘బియాండ్ మెంటారింగ్’ పేరుతో మొదలుపెట్టిన ఈ ప్రోగ్రామ్ ద్వారా మహిళలు వారి మెంటార్ను, మెంటారింగ్ సాగే కాలాన్ని ఎంపికచేసుకోవచ్చు. తొలుత 25 మంది మహిళా లీడర్లతో ప్రోగ్రామ్కు శ్రీకారం చుట్టామని, వీరికి ఆరునెలల పాటు పరిశ్రమ లీడర్లు శిక్షణ ఇస్తారని హైసియా విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అన్నపూర్ణా స్టుడియోస్ సీఈవో సుప్రియా యార్లగడ్డ ఈ ప్రోగ్రామ్ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. హైసియా ఇప్పటికే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 1000 మంది మహిళా ఐటీ నిపుణులు లీడర్షిప్ హోదాల్ని అందుకునేందుకు శిక్షణ ఇచ్చామని, తాజా మెంటారింగ్ కార్యక్రమంతో మరింత మంది మహిళల్ని లీడర్లుగా తీర్చిదిద్దుతామని హైసియా ప్రెసిడెంట్ భరణి అరోల్ చెప్పారు. బియాండ్ మెంటారింగ్ ప్లాట్ఫామ్లో 125 మంది పరిశ్రమ లీడర్లు మెంటార్లుగా ఉన్నారని, మహిళలు కోరుకున్న భాషలో ఒన్ ఆన్ ఒన్ మెంటారింగ్ను ఆఫర్ చేస్తున్నట్లు ఈ ప్రోగ్రామ్కు పార్టనర్గా ఉన్న బియాండ్ పింక్స్ సీఈవో తనుజా అబ్బూరి ఈ సందర్భంగా తెలిపారు.