Micron India | ప్రపంచంలోకెల్లా అతిపెద్ద సెమీ కండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ. ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ నెట్వర్క్ కలిగి ఉంది. 47 వేల పేటెంట్ హక్కులు కలిగి ఉన్న మైక్రాన్.. వచ్చే దశాబ్ద కాలంలో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధం అవుతున్నదని మైక్రాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ రామ్మూర్తి చెప్పారు. భారత్లోనూ, హైదరాబాద్తోపాటు ప్రపంచవ్యాప్తంగా సెమీ కండక్టర్ల మార్కెట్లలోకి అడుగిడేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
భారత్లో ఈ ఏడాది చివరిలోగా 3000 మంది నిపుణులను నియమించుకోనున్నదని ఆనంద్ రామూర్తి తెలిపారు. సెమీ కండక్టర్ల పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి భారత్ కానున్నది. 1200 మందికి పైగా ఇంజినీర్లు, ప్రతిభావంతులైన నిపుణులను నియమించుకుంటామని తెలిపారు. బహుళ దేశ సెమీ కండక్టర్ల కంపెనీల్లో ఒకటిగా మైక్రాన్.. భారత్ కోసం నంద్, డ్రామ్ మెమొరీ డిజైన్లను తీర్చిదిద్దుతామన్నారు.
వచ్చే రెండేండ్లలో ఐదువేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మైక్రాన్ ఎండీ ఆనంద్ రామ్మూర్తి చెప్పారు. గచ్చిబౌలిలోని న్యూ ఆఫీస్ క్యాంపస్లోకి ప్రవేశిస్తామన్నారు. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సిద్ధం అవుతుందని చెప్పారు. భారత్లో సెమీ కండక్టర్ల స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్తోపాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు మద్దతు కోసం ఐటీ టీంలను బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.