హైదరాబాద్, అక్టోబర్ 21: దేశంలోకెల్లా హైదరాబాద్ నగరం ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. కొవిడ్ సెకండ్వేవ్ నెమ్మదించిన తర్వాత కార్పొరేట్ల నుంచి డిమాండ్ పెరగడంతో ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ మార్కెట్ లీడర్గా ఆవిర్భవించిందని అమెరికాకు చెందిన మార్కెటింగ్ సంస్థ కొలియర్స్ తెలిపింది. ఈ నగరంలో జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 25 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్ జరిగింది. దీంతో ఈ విభాగంలో హైదరాబాద్… బెంగళూరును అధిగమించిందని కొలియర్స్ ఇండియా సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. 2021 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఊపందుకుందని, వర్క్స్పేస్ ఆపరేటర్ల నుంచి వస్తున్న డిమాండ్ కారణంగా పెద్ద లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగులు క్రమేపీ ఆఫీసులకు వస్తుండటంతో స్పేస్ లీజింగ్లో నిర్ణయాలు త్వరితగతిన జరుగుతున్నాయని నాయర్ తెలిపారు. కొవిడ్ మూడోవేవ్ లేకపోతే రానున్న త్రైమాసికాల్లో లీజింగ్ మరింత ఊపందుకుంటుందన్నారు.
ఈ సెప్టెంబర్ క్వార్టర్లో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ గ్రాస్ లీజింగ్ 34 శాతం వృద్ధితో 103 లక్షల చదరపు అడుగులకు చేరింది. 2020 సెప్టెంబర్ త్రైమాసికంలో ఇది 77 లక్షల చదరపు అడుగులు.
ఐటీ రంగం అభివృద్ధిచెందిన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, పుణెల్లో జరిగిన లీజింగ్ వాటా సెప్టెంబర్ త్రైమాసికంలో 62 శాతంగా ఉంది.
లీజింగ్లో ద్వితీయస్థానంలో ఉన్న బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 2021 జూలై-సెప్టెంబర్ క్వార్టర్లో 21 లక్షల చదరపు అడుగులకు తగ్గింది. గతేడాది ఇదేకాలంలో ఈ నగరంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 25 లక్షల చదరపు అడుగులు.
తృతీయస్థానంలో ఉన్న పుణెలో లీజింగ్ 3 లక్షల నుంచి 17 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.
ఢిల్లీ-ఎన్సీఆర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 9 లక్షల నుంచి 15 లక్షల చదరపు అడుగులకు చేరింది.
ముంబైలో మాత్రం లీజింగ్ 14 లక్షల నుంచి 12 లక్షల చదరపు అడుగులకు తగ్గింది.
చెన్నైలో లీజింగ్ 8 లక్షల నుంచి 13 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.