హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ మంగళవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో నిర్వహిస్తున్న ఎలివేట్ ఎక్స్పోలో వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలపై ప్రధానంగా చర్చించుకోవడంతోపాటు నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకునేందుకు ఈ సమ్మిట్ వేదికగా నిలుస్తున్నదన్నారు. వ్యాపార ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో కీలకంగా మారిందని, ముఖ్యంగా నిపుణులతో మార్కెటింగ్కు సంబంధించిన మెలుకువలు తెలుసుకునేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదర్శనగా నిలువనున్నదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి టీ-హబ్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంతా తౌటం కూడా హాజరయ్యారు.