హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో రిజిస్ట్రేషన్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో నగరంలో రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగాయని, వృద్ధిరేటు 30 శాతంగా ఉన్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం 2022 సెప్టెంబర్లో 4,766 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, ఈ ఏడాది అదే నెలలో 6,185 రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపింది. వీటి మొత్తం ఆస్తుల విలువ రూ.3,378 కోట్లుగా ఉన్నది. వీటి విలువ గతేడాదితో పోలిస్తే 42 శాతం పెరిగింది.
అమ్మకాలు జరిగిన వాటిలో ఖరీదైన నివాస గృహాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నది. నివాస గృహాల మార్కెట్లో హైదరాబాద్ జిల్లాతో పాటు మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు అత్యంత కీలకంగా ఉన్నాయి. 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన గృహాలను ఎక్కువగా కొనుగోలు చేశారని, ఇది 72 శాతంగా ఉన్నదని నివేదికలో పేర్కొన్నది. అదే విధంగా బడ్జెట్ పరంగా చూస్తే రూ.25 లక్షల నుంచి 50 లక్షల విలువ చేసే నివాస గృహాల శాతం 51 శాతం ఉండగా… రూ.50 – 75 లక్షల విలువ చేసే ఆస్తులు 17 శాతం, రూ.75 లక్షల నుంచి రూ.కోటి విలువ ఆస్తులు 8 శాతం, రూ. కోటి నుంచి రూ.2 కోట్లున్న ఆస్తులు 7 శాతం, రెండు కోట్లు పైబడిన ఆస్తులు 2 శాతంగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది.