హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ దెబ్బకు కుదేలైన దేశీయ రియల్ ఎస్టేట్ రంగం కోలుకుంటున్నది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్టీ జెట్ స్పీడ్తో పరుగులు తీస్తున్నది. కార్యాలయాలకైనా.. నివాస సముదాయాలకైనా.. దేశంలో భాగ్యనగరాన్ని మించినది లేదని ఇప్పటికే ఎన్నో ప్రధాన రియల్టీ కన్సల్టెంట్లు, ఏజెన్సీలు చెప్పిన విషయం తెలిసిందే. ఆఫీస్ స్పేస్ లీజులు, హౌజింగ్ యూనిట్స్ అమ్మకాల్లో రాష్ట్ర రాజధాని దూసుకుపోతున్నదని పేర్కొన్న సంగతీ విదితమే. తాజాగా ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ ప్రాప్టైగర్ సైతం ‘రియల్ ఇన్సైట్ (రెసిడెన్షియల్)-జూలై-సెప్టెంబర్ (క్యూ3) 2021’ నివేదికలో ఇదే విషయాన్ని మరోసారి చెప్పింది. కరోనా తొలి దశ కంటే రెండో దశ తీవ్రంగా ఉన్నప్పటికీ ఇండ్ల అమ్మకాల్లో రెట్టింపు స్థాయిని హైదరాబాద్ అందుకున్నట్లు పేర్కొన్నది. దేశంలోని మరే నగరం ఈ స్థాయి వృద్ధిని కనబర్చకపోవడం గమనార్హం.
టాప్ రెసిడెన్షియల్ మార్కెట్లలో..
స్థిరంగా పెరుగుతున్న ధరలు.. దేశంలో ముంబై తర్వాత అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ మార్కెట్గా హైదరాబాద్ను నిలిపాయి. కరోనా ప్రభావంలోనూ సరఫరా, డిమాండ్ కోణంలో పూర్తిస్థాయిలో భాగ్యనగరం కోలుకున్నదని ప్రాప్టైగర్ తన నివేదికలో వెల్లడించింది. ముంబైలో నివాస గృహాల చదరపు అడుగుకు సరాసరి ధర రూ.9,670గా ఉంటే, ఆ తర్వాత హైదరాబాద్లో రూ.5,751గా ఉందని పేర్కొంది.
బాచుపల్లి, తెల్లాపూర్, గండిపేట, దుండిగల్, మియాపూర్ ప్రాంతాల్లో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రాపర్టీల పరంగా మంచి డిమాండ్ ఉండటంతో మొత్తం మీద 50,103 యూనిట్లు అమ్ముడు కాకుండా ఉన్నప్పటికీ, అతి తక్కువగా ఇన్వెంటరీ 25 నెలలుగానే ఉన్నది. ఇక దుండిగల్, తెల్లాపూర్, గోపన్పల్లి, బాచుపల్లి, బండ్లగూడ జాగీర్ ప్రాంతాల్లో నూతన సరఫరా ఎక్కువగా ఉందని నివేదికలో ప్రాప్టైగర్ పేర్కొన్నది. ఈ ప్రాంతాల్లో నివాసం ఉండేందుకు కస్టమర్లు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది. గృహ రుణాలపై తక్కువ వడ్డీరేట్లు, సరసమైన ధరలకే నచ్చిన చోట్ల ఆకర్షణీయమైన ఇండ్లు లభిస్తుండటం మార్కెట్కు కలిసొస్తున్నది. దేశంలోని టాప్-8 నగరాల్లో కొత్త నివాస ప్రాజెక్టులూ గతంతో చూస్తే 19,865 యూనిట్ల నుంచి 65,211 యూనిట్లకు పెరిగాయి.
‘ధరలు పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్లో స్థిరాస్తులకు అధిక డిమాండ్ కనిపిస్తున్నది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్లో 7,812 యూనిట్లు అమ్ముడవగా, నిరుడుతో చూస్తే 140% వృద్ధి నమోదైంది. ఈ ఏప్రిల్-జూన్తో పోల్చితే ఏకంగా 222 శాతం పెరిగాయి’
-రాజన్ సూద్, ప్రాప్టైగర్.కామ్ వ్యాపార అధిపతి