హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఔషధ రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇక్కడ తమ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇందులోభాగంగానే అత్యాధునిక సాంకేతికత, సౌకర్యాలతోకూడిన ఓ ల్యాబ్ క్యాంపస్ను జీనోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తున్నట్టు ఫ్రాన్స్కు చెందిన యూరోఫిన్స్ కంపెనీ ప్రకటించింది. దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడితో దీన్నిక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఆహారం, పర్యావరణం, ఫార్మాస్యూటికల్, కాస్మోటిక్ ఉత్పత్తుల పరీక్షల్లో, బయో అనలిటికల్ టెస్టింగ్లో యూరోఫిన్స్.. గ్లోబల్ లీడర్గా ఉన్నది. కాగా, హైదరాబాద్లో ప్రారంభించే ఈ అధునాతన టెస్టింగ్ ల్యాబ్తో భారతీయ ఔషధ మారెట్లో యూరోఫిన్స్ విస్తరించాలని చూస్తున్నది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో యూరోఫిన్స్ ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో తమ విస్తరణ ప్రణాళికలను చర్చించింది. ఈ క్రమంలోనే ల్యాబ్ను ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది.
90వేల అడుగుల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక ప్రయోగశాల ఏర్పాటవుతున్నది. తమ అనుబంధ సంస్థ యూరోఫిన్స్ అడ్వినస్ ద్వారా హైదరాబాద్లో ఈ ప్రయోగశాలను యూరోఫిన్స్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ పరిశోధన, అభివృద్ధి సంస్థ, బయో అనలిటికల్ సర్వీసెస్, ఇన్-వివో ఫార్మకాలజీ, సేఫ్టీ టాక్సికాలజీ రంగాలకు చెందిన దేశ, విదేశీ ఫార్మాసూటికల్ కంపెనీలకు అవసరమైన సేవల్ని అందిస్తారు. అలాగే చిన్న బయోటెక్ కంపెనీలకూ సర్వీసులనిస్తారు. ప్రస్తుతం భారత్లో యూరోఫిన్స్ కొనసాగిస్తున్న కార్యకలాపాలతోపాటు డిసవరీ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, బయో అనలిటికల్ సర్వీస్లను ఈ ల్యాబ్ ద్వారా మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఫార్ములేషన్ డెవలప్మెంట్తోపాటు ఇన్-విట్రో, ఇన్-వివో బయాలజీ విభాగాల్లో తన సేవలను విస్తరించేందుకు 2023వ సంవత్సరం ప్రారంభం నుంచే యూరోఫిన్స్ అడ్వినస్కు ఈ ల్యాబ్తో అవకాశం కలుగుతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తోపాటు తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పన్ కూడా పాల్గొన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతోపాటు లాబోరేటరీ నెట్వర్ను మరింత సుస్థిరం చేసుకునే దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయి. ఔషధాల పరిశోధన, తయారీలో ప్రపంచవ్యాప్తంగా భారత్కున్న ప్రాధాన్యత, సామర్థ్యం మాకు తెలుసు. అందుకే హైదరాబాద్లో ఈ కొత్త ల్యాబ్ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్నాం. ఔషధాల అభివృద్ధి, ఆవిషరణల్లో ఈ హైదరాబాద్ కేంద్రం ప్రధాన పాత్ర పోషించగలదు’
-డాక్టర్ గిల్లెస్ మార్టిన్, యూరోఫిన్స్ సీఈవో
‘హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలోకి యూరోఫిన్స్ ప్రవేశిస్తున్నందుకు సంతోషంగా ఉన్నది. సంస్థ విస్తరణ-వృద్ధి ప్రణాళికల కోసం హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా యూరోఫిన్స్ పరిగణిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. తాజా పెట్టుబడితో జీనోమ్ వ్యాలీలోని గ్లోబల్ కంపెనీల జాబితాలో యూరోఫిన్స్ కూడా చేరింది. యూరోఫిన్స్కు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా మద్దతునిస్తుంది. మా రాష్ట్రంలో అవకాశాలకు కొదవే లేదు’
-కేటీఆర్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి