శంషాబాద్, అక్టోబర్ 6: జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్ఐఏఎల్)పై రూ.5 లక్షలు జరిమానా పడింది. ఓ కేసు తీర్పులో భాగంగా ఈ ఫైన్ను తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం విధించింది. వివరాల్లోకి వెళితే.. సుబ్రతో బెనర్జీ అనే ప్రయాణీకుడు 2014 సెప్టెంబర్ 10న బెంగళూరు వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్పోర్టు చేరుకున్నారు. విమానం ఎక్కేందుకు ఎస్కలేటర్పై వెళ్తుండగా ఒక్కసారిగా జర్క్ ఇచ్చి ఆగిపోయింది. దీంతో సుబ్రతో బెనర్జీ కిందపడిపోగా ఎస్కలేటర్పై ఉన్న ఇతరులు ఆయనపై పడ్డారు. గాయాలపాలైన బెనర్జీ రూ.50 లక్షల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే తాజాగా జీహెచ్ఐఏఎల్పై ఈ జరిమానా పడింది. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే దవాఖానకు తరలించి చికిత్స అందించామని, గుడ్విల్గా రూ.1,51,468 సైతం చెల్లించినట్లు జీఎమ్మార్ వర్గాలు వాదించాయి. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో జరిమానా తప్పలేదు. కాగా, జరిమానా మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని, లేనిపక్షంలో 9 శాతం వార్షిక వడ్డీ పడుతుందని సంఘం హెచ్చరించింది. అలాగే ఫిర్యాదుదారునికి అదనపు ఖర్చుల నిమిత్తం మరో రూ.10,000 ఇవ్వాలంటూ జీహెచ్ఐఏఎల్ను ఆదేశించింది.